
అమరావతి, జనవరి 2: వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది. డిసెంబర్ అంతా గజగజ లాడించిన శీతాకాలం.. జనవరిలోనూ ప్రతాపం చూపనుంది. గత రెండు, మూడు రోజుల నుంచి కాస్త చలి తగ్గినప్పటికీ మునుముందు రోజుల్లో చలి తీవ్రత పెరగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య దిశగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈశాన్య, తూర్పు దిశల్లో చలి గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు, రేపు పొగమంచు కురిసే అవకాశం ఉంది. రాగల 2 రోజులు ఉత్తర కోస్తా, యానాం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలలో మార్పు ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత 3 రోజులు అక్కడక్కడ సాధారణం కంటే 2-3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణలో నిన్నటి వరకు సింగిల్ డిజిట్ గా ఉన్న ఉష్ణోగ్రతలు డబల్ డిజిట్ కు చేరుకున్నాయి. కొంతమేర చలి తీవ్రత తగ్గుముఖం పట్టినా మునుముందు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆదిలాబాద్, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్, మెదక్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి ,వరంగల్, వికారాబాద్, జనగాం, జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.