ఏం మనిషివి రా.. లావుగా ఉందని భార్యను హతమార్చిన సాఫ్ట్వేర్ మైండ్! గూగుల్లో సెర్చ్ చేసి స్కెచ్
కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ఈ ఘటన నాగరిక సమాజం తలదించుకునేలా ఉంది. కేవలం లావుగా ఉంది అనే చిన్న కారణంతో ఎనిమిదేళ్ల బంధాన్ని, కన్న బిడ్డను కూడా మర్చిపోయి ఒక భర్త ఇంతటి కిరాతకానికి ఒడిగట్టడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పదిమందిలో అవమానమని భావించి ఆమె ప్రాణమే తీశాడు. ఇందుకోసం గూగుల్లో సెర్చ్ చేసి మరీ పక్కా స్కెచ్ వేశాడు. పోలీసుల వివరణ మేరకు పూర్తి వివరాల్లోకి వెళితే..

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య కాస్త లావుగా ఉందని, ఆమెను పదిమందిలోకి తీసుకెళ్లడం తనకు అవమానమని భావించిన ఒక భర్త, అత్యంత దారుణంగా ఆమెను హతమార్చాడు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం ఈశ్వర్ రెడ్డి నగర్లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రొద్దుటూరుకు చెందిన బద్రిపల్లి కిరణ్కు, ముద్దనూరుకు చెందిన పద్మతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఏడేళ్ల పాటు వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే, బిడ్డ పుట్టిన తర్వాత పద్మ బరువు పెరగడం ప్రారంభమైంది. ఆమె అధికంగా నాన్ వెజ్, ఫాస్ట్ ఫుడ్ తినడం వల్లే బరువు పెరుగుతోందని కిరణ్ భావించేవాడు. లావుగా ఉన్న భార్యను చూసి అవమానంగా ఫీలైన కిరణ్, ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
భార్యను ఎలా చంపాలనే దానిపై కిరణ్ ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా చంపే మార్గాల కోసం వెతికాడు. చివరకు ఆన్లైన్లో సుమారు రూ. 80 వేల విలువైన ఒక విష ద్రావణాన్ని ఆర్డర్ చేశాడు. ఆ పార్సిల్ వచ్చిన తర్వాత, పుట్టింటిలో ఉన్న భార్యను నమ్మించి ప్రొద్దుటూరుకు తీసుకొచ్చాడు. మరుసటి రోజు భార్యకు ఇచ్చే ఆహారంలో ఆ విష ద్రావణాన్ని కలిపి ఇచ్చాడు. అది తిన్న పద్మ స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లగానే, దిండుతో ఆమె ముఖంపై అదిమి పట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు.
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా, కిరణ్ చేసిన పాపం బయటపడింది. ఇంతటి ప్రమాదకరమైన విష పదార్థాలను ఆన్లైన్లో సరఫరా చేస్తున్న ముఠా ఎవరనే కోణంలో పోలీసులు ఇప్పుడు ఆపరేషన్ ప్రారంభించారు. నిందితుడు కిరణ్ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతనికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఒక మనిషి అందం చూసి ప్రేమించడం కాదు, గుణం చూసి గౌరవించాలని పెద్దలు చెబుతుంటారు. కానీ, బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చి, ప్రాణ స్నేహితురాలు కావాల్సిన భార్యను ఇలా చంపుకోవడం విచారకరం. శరీర బరువు తగ్గించుకోవడానికి మార్గాలు ఉన్నా, ఆయువు తగ్గించడమే మార్గమని భావించిన ఈ భర్త చేసిన పని క్షమార్హం కానిది. కాగా, ఈ ఘటన ఆన్లైన్లో దొరుకుతున్న ప్రమాదకరమైన రసాయనాల నియంత్రణపై కూడా చర్చకు దారితీస్తోంది.




