
ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 14: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వారిపై SEB అధికారులు దాడులు చేశారు. జిల్లాలో తొలిసారి గంజాయి చాక్లెట్లు వెలుగులోకి రావడంతో ఎస్ఇబి అధికారులు, పోలీసులు ఉలిక్కిపడ్డారు. ప్రధానంగా చీమకుర్తిలో గ్రానైట్ క్వారీల్లో పనిచేసే ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను టార్గెట్ చేసుకుని ఈ గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. చీమకుర్తి మండలంలోని బూదవాడ, మర్రిచెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కార్మికులకు ఈ చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఇబి అధికారులు నిఘా పెట్టారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బీహార్కు చెందిన రమేష్ సహాని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 3 కేజీల 480 గ్రాముల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు…
ప్రకాశం జిల్లా ఎస్పి పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు చీమకుర్తి మండలం బుదవాడ గ్రామంలో బీహార్ వాసి రమేష్ సహానీ గ్రానైట్ కంపెనీల సమీపంలో బడ్డీకొట్టు నిర్వహిస్తున్నాడు. అతని ఇంటిపై ఎస్ఇబి అధికారులు, పోలీసులు దాడి చేశారు. బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి అమ్ముతున్నాడన్న అనుమానంతో రమేష్ను అదుపులోకి తీసుకున్నారు… ఇతని దగ్గర నుంచి 10 వేల రూపాయలు విలువచేసే 540 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఈబి సిఐ మారయ్య బాబు తన సిబ్బందితో కలిసి ఈ దాడులు చేశారు. చీమకుర్తి ప్రాంతంలోని గ్రానైట్ క్వారీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వేల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో కొంతమందికి గంజాయి తాగే అలవాటు ఉండటంతో వీరిని టార్గెట్ చేసుకుని గంజాయి చాక్లెట్లను తొలిసారి ఈ ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు గుర్తించారు.
ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పవని ఎస్ఇబి సిఐ మారయ్య బాబు హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధులు విక్రయించే వారికి సంబందించి వివరాలను ఎస్ఈబి అధికారులకు తెలియచేయాలని కోరారు.. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఇబి ఎస్ఐ వినితా రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ యూసఫ్ షరీఫ్, కానిస్టేబుల్ రామిరెడ్డి, బాలసుబ్బయ్య, సురేష్, శ్రీనివాస్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…