
సార్ నేను కొని తెచ్చిన మటన్ ఉడకలేదు.. అర్జెంటుగా దాన్ని అమ్మిన మటన్ షాపు యజమానిపై కేసు పెట్టండి అంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులకు విచిత్ర కంప్లైంట్ వచ్చింది. మటన్ ఉడకలేదని బాధితుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడిపత్రి పట్టణానికి చెందిన సోడాల హాజీ అనే వ్యక్తి ఉగాది సందర్భంగా మటన్ కొనుగోలు చేశాడు. అయితే ఆ మటన్ కుక్కర్లో 20 విజిల్స్ వచ్చేవరకు ఉడికించినా ఉడకకపోవడంతో.. తనకు మటన్ అమ్మిన షాపు యజమానిపై కేసు పెట్టాలని బాధితుడు హాజీ తాడిపత్రి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అందుకు సాక్షంగా మటన్ ఉడికించిన కుక్కర్ గిన్నెను కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. పండక పూట నీసు తిందామని ఎంతో ఆశగా మటన్ తెచ్చుకుంటే.. ఎంతసేపటికి ఉడకని దిక్కుమాలిన మాసం అమ్మాడని.. దీంతో మటన్ షాపు యజమానిపై చర్యలు తీసుకోవాల్సిందే అని బాధితుడు హాజీ పోలీసులను పట్టుబట్టాడు. దీంతో చేసేది ఏమీ లేక మటన్ షాప్ నిర్వాహకుడికి ఫోన్ చేసి మందలించి.. బాధితులు హాజీకి సర్ది చెప్పి ఇంటికి పంపించారు.
మొన్నామధ్య ఉరవకొండలో కజ్జికాయలు ఇవ్వలేదని అత్తింట్లో అల్లరి చేసిన చిన్నల్లుడు పంచాయతీకి కూడా పోలీసులు ఎంటరయ్యి శుభం కార్డు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితుడిని సైతం సముదాయించి పంపేశారు. అయినా మటన్ ఉడకలేదని ఏకంగా మటన్ కూర గిన్నెను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం విచిత్రంగా ఉందని కొందరు కామెంట్ చేస్తుంటే.. కేజీ మటన్ రూ.1000 వరకు ఉంది.. అతను చేసిన పనిలో తప్పు లేదని మరికొందరు సమర్థిస్తున్నారు.
Also Read: ఎండాకాలంలో మిగిలిపోయిన పిడికెడు అన్నంతో విపరీతంగా మల్లె పూలు