Madanapalle Double Murder case: మదనపల్లె జైలులో పద్మజ వింత చేష్టలు.. తోటి మహిళ ఖైదీల భయాందోళన
Madanapalle Double Murder case: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మధనపల్లెలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో పోలీసుల విచారణలో రోజుకో ఆసక్తికర విషయాలు..
Madanapalle Double Murder case: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మధనపల్లెలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో పోలీసుల విచారణలో రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం కలియుగ యుద్ధం జరుగుతోంది.. శివుడు వస్తున్నాడు.. కలియుగం అంతం అవుతుంది అంటూ కన్నబిడ్డలను హత్య చేసిన నిందితుల్లో ఒకరైన పద్మజ జైలులో వింత వింతగా ప్రవర్తించడం తోటి మహిళ ఖైదీలు భయాందోళన చెందుతున్నారు. కన్నకూతుళ్లను కడతేర్చిన తల్లిదండ్రులు పురుషోత్తం, పద్మజను తిరుపతి రుయా ఆస్పత్రిలోని మానసిక చికిత్స విభాగానికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం మనదపల్లె సబ్జైలులో ఉన్న నిందితుల వింత వింత చేష్టలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
పురుషోత్తం స్థిమితంగానే వ్యవహరిస్తున్నా.. ఆయన భార్య పద్మజ మాత్రం వింత వింతగా ప్రవర్తిస్తోందని మదనపల్లె సబ్జైలు సూపరింటెండెంట్ రామకృష్ణ యాదవ్ మీడియాకు తెలిపారు. ఆమె వింత వింతగా ప్రవర్తిస్తూ ఆరుపులు, కేకలు వేయడం సమస్యగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తానే శివుణ్ణి, కాశికను అని చనిపోయిన తన కుమార్తెలు శివపార్వతులంటూ జైలులో హడావిడి చేస్తోందని అన్నారు. రాత్రుళ్లు నిద్రపోకుండా గోడలకు పూజలు చేయడం, కేకలు వేయడం వంటి చర్యలతో జైలు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే మెరుగైన చికిత్స కోసం దంపతులను విశాఖకు తరలించాలని తిరుపతి వైద్యులు సూచించినప్పటికీ బందోబస్తుకు ఏఆర్ సిబ్బంది సహకరించడం లేదని ఆయన అన్నారు. ఈ విషయమై జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించామని అన్నారు.
పద్మజ ఉంటున్న బ్యారక్లో మహిళలు రాత్రుల్లో నిద్రించాలంటే భయాందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. పురుషోత్తం కూడా ఒంటరిగా కూర్చొని నమస్కారాలు చేసుకుంటున్నాడని, ఒక్కోసారి ఏడుస్తున్నాడని జైలర్ ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వారిని విశాఖకు తరలించేందుకు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.