
సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయంలో రోకలిని నిలబెట్టడం ఇప్పటికీ సంప్రదాయంగా వస్తుంది. ఇత్తడి ప్లేట్ (తాంబూలం) లోనో బియ్యం పోసే రోట్లో లేదా నేల మీద నిలబెట్టడం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నేటికి కనిపిస్తుంది. ఈ ఆసక్తికరమైన ఆచారం వెనుక సైతం నమ్మకాలు, శాస్త్రీయ కోణాలు కనిపిస్తాయి. చాలా మంది నమ్మకం ప్రకారం గ్రహణ సమయంలో భూమి, చంద్రుడు – సూర్యుడు ఒకే సరళరేఖలోకి రావడం వల్ల గురుత్వాకర్షణ శక్తిలో మార్పులు సంభవిస్తాయి. ఈ సమయంలో భూమిపై ఉండే అయస్కాంత శక్తి లేదా గురుత్వాకర్షణ ప్రభావం వల్ల రోకలి ఎటువంటి ఆధారం లేకుండా నిటారుగా నిలబడుతుందని నమ్ముతారు.
గ్రహణ సమయంలో రోకలి నిలబడితే అది ఆ ప్రాంతానికి, ఆ ఇంటికి శుభప్రదమని మంచి జరుగుతుందని భావిస్తారు. పూర్వం గ్రహణం పట్టు విడుపులను తెలుసుకోవడానికి గడియారాలు లేనప్పుడు, రోకలి పడిపోవడాన్ని బట్టి గ్రహణం విడిచిందని గుర్తించే వారని పెద్దలు చెబుతున్నారు. అయితే, గ్రహణానికి రోకలి నిలబడటానికి ప్రత్యక్ష సంబంధం లేదని హేతువాదులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోకలి కింద భాగం సమాంతరంగా ఉండి, దానిని సరైన కేంద్ర బిందువు వద్ద నిలబెడితే అది ఏ రోజైనా నిలబడుతుందనేది హేతువాదుల వాదన..
మరోవైపు గ్రహణ సమయంలో ప్రజలు ఎక్కువ శ్రద్ధగా, ఏకాగ్రతతో దానిని నిలబెట్టడానికి ప్రయత్నించడం వల్ల అది నిలబడుతుందే తప్ప, గ్రహణ శక్తి వల్ల కాదననేది శాస్త్రవేత్తల అభిప్రాయం. హేతువాదులు, సంప్రదాయవాదుల వాదనలు ఎలా ఉన్నా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నరసయ్య అగ్రహారంలో చంద్రగ్రహణం పురస్కరించుకుని ఇత్తడి పళ్లెంలో రోకలి నిలబెట్టారు రాజశేఖర్ దంపతులు. ఇది చూసేవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇత్తడి ప్లేట్ పై రోకలిని నిలబెట్టడాన్ని పలువురు ఆసక్తిగా చూసేందుకు వచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..