చేప ముల్లు గొంతులో చిక్కుకుంటేనే విలవిల్లాడిపోతాం… అదే బతికున్న చేప గొంతులో ఇరుక్కుంటే ఇంకేముంది ప్రాణం పోయినట్టే… అలాంటి పరిస్థితుల్లోనే బతికున్న చేప గొంతులో ఇరుక్కుని ఓ మత్స్యకారుడు చావు అంచులదాకా వెళ్లి డాక్టర్ల పుణ్యమా అని ప్రాణాలతో బయట పడ్డ ఘటన ఒంగోలులో జరిగింది.
ఒంగోలుకు చెందిన సుబ్రహ్మణ్యం మత్స్యకారుడు. సముద్రంలో వేటకు వెళ్లి చేపలు పట్టి జీవనం సాగిస్తున్నాడు… అలా వేటకు వెళ్లి వచ్చాక వలను నోటితో పట్టుకుని చేపలను వేరు చేస్తున్నాడు… ఆ సమయంలో బతికే ఉన్న ఓ చేప సుబ్రహ్మణ్యం గొంతులోకి జంప్ చేసింది. దీంతో చేప అతని గొంతులో ఇరుక్కుపోయింది… అటు కడుపులోకి వెళ్ళదు… ఇటు బయటకి రాకుండా చేప కొట్టుకుంటుండటంతో కొద్దిసేపు సుబ్రహ్మణ్యం విలవిల్లాడాడు. ఆ తరువాత కొద్దిసేపటికి గొంతులోనే చనిపోయిన చేప సుబ్రహ్మణ్యంకు ఊపిరి ఆడకుండా చేసింది. శ్వాసతీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా మారడంతో ఒంగోలులోని జిజిహెచ్లో చేర్పించారు.
ఆపరేషన్ చేసి చేపను బయటకు తీసిన వైద్యులు.
సుబ్రహ్మణ్యం గొంతులో ఇరుక్కున్న చేపను ENT విభాగానికి చెందిన డాక్టర్ ప్రభాకర్ నేతృత్వంలోని వైద్య సిబ్బంది పరిశీలించి శస్త్ర చికిత్స చేశారు… గంటపాటు శ్రమించి ట్రాకియాష్టిమి పద్ధతిలో విజయవంతంగా చేపను గొంతునుంచి బయటకు తీశారు… దీంతో సుబ్రహ్మణ్యానికి ప్రాణాపాయం తప్పింది… క్లిష్టతరమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యుల బృందాన్ని జిజిహెచ్ సూపరెంటెండెంట్ మాణిక్యరావు అభినందించారు. శస్త్రచికిత్సను నిర్వహించిన బృందంలో ఈఎన్టి హెచ్వోడి డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ రాంబాబు, డాక్టర్ కవిత, డాక్టర్ అర్జున్, డాక్టర్ లాలస ఉన్నారు.
Also Read: కరివేపాకు చెట్టుకు ఇది వేశారంటే.. సూపర్గా పెరుగుతుంది..