
అమరావతి, అక్టోబర్ 1: రాష్ట్ర వ్యాప్తంగా నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఈ నెల పింఛన్ల పంపిణీ కింద మొత్తం రూ.2,745 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక తొలి రోజు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సచివాలయ సిబ్బంది పింఛన్లు అందజేశారు. ఈ క్రమంలో అయితే కడప జిల్లాలో మాత్రం పింఛన్ల పంపిణీ విషయంతో వివాదం నెలకొంది. కడప నగరంలో ఇంటింటి వెళ్లి పింఛన్ పంపిణీ చేయడానికి బదులు.. సచివాలయాల వద్దనే సచివాలయ ఉద్యోగులు పింఛన్లను పంపిణీ చేశారు.
దీంతో పింఛన్ దారులను సచివాలయాల వద్దకు రమ్మని ఉద్యోగులు కబురు పంపారు. వాలంటీర్లు చేసే ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ తాము చేయలేమని సచివాలయ సిబ్బంది చేతులెత్తేసింది. దీంతో గత్యంతరంలేక ముసలవ్వలు, వికలాంగులు సచివాలయాల వద్దకు వచ్చి పెన్షన్ తీసుకెళ్లారు. ఇకపై కూడా సచివాలయాల్లోనే పింఛన్లు పంపిణీ చేస్తామని అక్కడి సచివాలయ ఉద్యోగులు అనడంతో పింఛన్ దారులు తలలు పట్టుకుంటున్నారు. కాగా ప్రతి నెలా 5వ తేదీ వరకు పింఛన్లు పంపిణీ చేస్తామని, సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి పంపిణీ చేస్తామని కూటమి సర్కార్ ఎంతో ఘనంగా చెప్పింది. కానీ గ్రౌండ్ లెవల్ లో పరిస్థితి ఇలా ఉంది. దీనిపై సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి..?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.