
సోషల్ మీడియా పరిచయాలు ఎలాంటి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. అనైతిక సంబంధాలు, అసాంఘిక పనులకు సోషల్ మీడియాను మాధ్యమంగా వాడుకుంటున్నారు కొందరు. తాజాగా సోషల్ మీడియా పరిచయం ఓ వివాహితను దారి తప్పేలా చేసింది. పెళ్లై, పిల్లలున్న వివాహిత సోషల్ మీడియా మాయలో పడింది. ఏపీలో పరిచయం అయిన వ్యక్తిని నమ్మి.. అతని ప్రేమలో మునిగిపోయింది. కానీ ఆ నమ్మకంలో చేసిన తప్పు.. చివరకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్కు చెందిన 30 ఏళ్ల వివాహితకు ఇన్ స్టాగ్రామ్లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు గంటల కొద్దీ చాటింగ్లో మునిగితేలారు. ఆపై ఆడియో, వీడియో కాల్స్ కూడా నడిచాయి. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనను ధనవంతుడిగా, అనుభవం ఉన్న వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి మాటలను ఆమె పూర్తిగా నమ్మేసింది. భర్త, ముగ్గురు చిన్నారులను వదిలి.. ఇన్స్ట్రాగ్రామ్ ప్రియుడితో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆ మహిళ ఇంటి నుంచి పారిపోయి ఏపీ చేరుకుంది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో తన ఆన్ లైన్ ప్రియుడ్ని కలుసుకుంది. అయితే అక్కడే అసలు నిజం బయటపడింది. తనను ధనవంతుడు అని చెప్పుకున్న వ్యక్తి వాస్తవానికి దినసరి కూలీగా పనిచేస్తున్నాడని తెలిసి ఆమె షాక్ గురైంది. తాను మోసపోయానని గ్రహించి తీవ్ర నిరాశకు లోనైంది.. ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఫోన్ సిగ్నల్, సోషల్ మీడియా వివరాల ఆధారంగా ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. పోలీసుల జోక్యంతో మహిళను సురక్షితంగా తీసుకువచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు కలిసి ఆమెకు నచ్చజెప్పడంతో చివరకు తిరిగి తన కుటుంబం వద్దకు చేరింది.
ఈ ఘటనలో విశేషం ఏమిటంటే భార్య దారి తప్పినా.. భర్త మంచి మనసుతో తిరిగి ఆమెను ఏలుకునేందుకు అంగీకరించాడు. కుటుంబం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం మరో అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. టెక్నాలజీ దూరాలను దగ్గర చేస్తుంది. కానీ మరోవైపు చెడు సావాసాలను కూడా పరిచయం చేస్తుంది. అందుకే అప్రమత్తత అవసరం అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: ఈ ఆకులు నాటు కోళ్లకు వేసి చూడండి.. తర్వాత మీరే ఆశ్చర్యపోతారు…