Pawan Kalyan: రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగు పడాలంటే జనసేనకు (Janasena) అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పటిష్టమైన పాలనకు జనసేన దగ్గర వ్యూహం అందని అయన పేర్కొన్నారు. శనివారం మండపేటలో జరిగిన కౌలు రైతుల భరోసా యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న పవన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గోదావరి జిల్లాల నుంచి మొదలయ్యే మార్పు పులివెందులను తాకాలి. వైసీపీ వాళ్లకు నోరు, చెయ్యి లేస్తే… మాకూ నోరు, చెయ్యి లేస్తుంది. నేను… ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు వేయమని అడగడం లేదు. దశాబ్దంన్నర నుంచి ప్రజల కష్టాలను నిశితంగా పరిశీలించాను. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను అర్థం చేసుకున్నాను. ప్రజల కోసం జనసేన నిలబడుతుందా..? పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటి? జనసేన పార్టీ పాలన ఎలా ఉంటుంది? అని మీరే ఆలోచించుకోండి. మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో చర్చించుకోండి. ఆలోచించి ఆశీర్వదించండి. నాకు ఎప్పుడు ఇవ్వడమే తప్ప అడగడం తెలియదు. కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కచ్చితంగా జనసేనకు అవకాశం ఇవ్వాలని, మీరంతా దీనిపై చర్చించుకుని ఆశీర్వదించాలని కోరుతున్నాను’ అని పవన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజాక్షేత్రంలో ఎలాంటి బెదురుబెరుకు లేకుండా నిలబడతామని పవన్ అన్నారు. ప్రజలకు అద్భుతమైన పాలన అందించడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని, పోటీ చేసే జనసేన అభ్యర్థిలో తనను చూడండి అని పవన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధి కోసం జనసేన పార్టీ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతుందని తెలిపారు. కంఠంలో ప్రాణం ఉండగా అవినీతికి ఆస్కారం ఇవ్వనని, కచ్చితంగా అందరి ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో జనసేన జెండాను ఎగురవేస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
ఇక జగన్ మోహన్ రెడ్డిపై కూడా పవన్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.. అన్న వస్తున్నాడు… మామయ్య వస్తున్నాడు… మంచి రోజులు వస్తున్నాయి అని మభ్య పెట్టారని విమర్శించారు. అధికారమే పరమావధిగా నోటికొచ్చిన ప్రతి వాగ్దానం చేసి, ఇప్పుడు ప్రజలను ఆనాటి బూటకపు మాటలకు బలి చేస్తున్నారన్నారు. అడిగినదానికి, అడగని దానికి కూడా అధికారం కోసం హామీలు వర్షం కురిపించిన ఘనత వైసీపీ నాయకులకే దక్కుతుందని విరుచుకుపడ్డారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..