NCBN Arrest : గురువారం చంద్రబాబును కలవనున్న పవన్ కల్యాణ్.. ములాఖత్‌కు అనుమతి..

Chandrababu Naidu Arrest: చంద్రబాబు నాయుడితో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ములాఖత్ కానున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. ఇప్పటికే ములాఖత్‌ అయ్యేందుకు జైలు అధికారుల నుంచి అనుమతిలభించింది. అయితే, చంద్రబాబు, పవన్ మధ్య సుమారు 40 నిమిషాల పాటు భేటీ జరగుతుందని సమాచారం. ములాఖత్ తర్వాత..

NCBN Arrest : గురువారం చంద్రబాబును కలవనున్న పవన్ కల్యాణ్.. ములాఖత్‌కు అనుమతి..
Pawan Kalyan -Chandrababu

Updated on: Sep 13, 2023 | 5:45 PM

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ములాఖత్ కానున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. ఇప్పటికే ములాఖత్‌ అయ్యేందుకు జైలు అధికారుల నుంచి అనుమతిలభించింది. అయితే, చంద్రబాబు, పవన్ మధ్య సుమారు 40 నిమిషాల పాటు భేటీ జరగుతుందని సమాచారం. ములాఖత్ తర్వాత ఇద్దరి మధ్య జరిగిన చర్చల వివరాలను మీడియాకు వెళ్లడించే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడనున్నారు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చంద్రబాబు అరెస్టును పవన్ ఖండిస్తూ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ అయిన క్షణం నుంచి తెలుగు దేశం పార్టీ శ్రేణులకు అండగా నిలిచారు వపన్ కల్యాణ్. అరెస్టు చేసిన రోజు విజయవాడకు రావడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పవన్‌. ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేందుకు వీసా, పాస్‌పోర్టు కావాలా అని ప్రశ్నించారు. వైసీపీపై తాను పోరాటం చేస్తానని ధైర్యం కల్పించారు. అంతేకాదు..తిరిగి మరోరోజు అంటే సోమవారం నాడు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ధర్నాలు చేయగా.. జనసేన పార్టీ వారికి మద్దతిచ్చింది.

ఇదిలావుంటే సరైన సాక్ష్యాలు లేనప్పటికీ.. జ్యుడిషియల్ రిమాండ్ విధించడంపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ నెల 10న ఏసీబీ కోర్టు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలంటూ, తదుపరి చర్యలు జరగకుండా స్టే విధించాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు. అయితే.. ఈ క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు గడువు కావాలని, సోమవారం విచారణ జరపాలని ఏఏజీ సుధాకర్‌రెడ్డి కోరారు. సోమవారం వినాయకచవితి పండుగ సెలవు ఉండటంతో ఆ మరునాడు వాదనలు వింటామని అన్నారు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి.  దీంతో వచ్చే మంగళవారానికి ఈ పిటిషన్‌ వాయిదా పడింది.

దీంతోపాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా అదే రోజుకు వాయిదా పడింది. ఈ కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారు. రింగ్ రోడ్డు కేసులో కూడా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు అభ్యర్థించారు చంద్రబాబు. ఇది కూడా వచ్చే మంగళవారమే విచారణకు రానుంది.. అయితే వచ్చే సోమవారం వరకు చంద్రబాబును కస్టడీకి ఇవ్వొద్దని కోర్టు ఆదేశించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం