
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంపై ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఈ పథకం ద్వారా వృద్దులకు ప్రతీ నెలా రూ.4 వేలు అందిస్తుండగా.. అంగవైకల్యంతో బాధపడేవారికి రూ.6 వేలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి రూ.10 వేలు అందిస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీన ఇంటి వద్దకే వెళ్లి లబ్దిదారులకు వీటిని పంపిణీ చేస్తున్నారు. ఇక 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజే పింఛన్దారులకు అందిస్తున్నారు. మార్చి 1న ఆదివారం రావడంతో ఫిబ్రవరి 28న అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పింఛన్లపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పొందుతున్నవారు గందరగోళానికి గురయ్యేలా షాకింగ్ ప్రకటన చేసింది ప్రభుత్వం. పింఛన్లు పొందుతున్నవారిలో ఎవరైనా అనర్హులు ఉంటే తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనర్హుల పింఛన్లను తొలగించే అధికారాలను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి శ్రీనివాస్ దీని గురించి తాజాగా ప్రకటన చేశారు. ఈ నిర్ణయం ద్వారా పథకంలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇక అనర్హులపై ఎవరైనా ఫిర్యాదులు చేయొచ్చని, కలెక్టర్లు విచారణ నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. నిజమైతే నిర్ధారణ అయితే వెంటనే పింఛన్ తొలగించడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నిజమైన లబ్దిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిజమైన అర్హులకు ఎప్పటిలాగే పింఛన్లు కొనసాగుతాయని ప్రభుత్వం వెల్లడించింది. పింఛన్ల పథకం, పంపిణీలో పారదర్శకత తెచ్చేందుకు అనర్హులను తొలగిస్తామని తెలిపింది. కాగా గతంలో ప్రభుత్వం పింఛన్లు పొందుతున్న కొంతమందికి నోటీసులు జారీ చేసింది. అర్హతను మళ్లీ నిర్ధారించుకోవాలని కోరింది. దీంతో పింఛన్ పోతుందేమోనని చాలామంది భయపడ్డారు. కానీ యథావిధిగా లబ్దిదారులకు పింఛన్లు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి పింఛన్ల తొలగింపుపై ప్రకటన రావడంతో కొంతమంది లబ్దిదారుల్లో ఆందోళన మొదలైంది. కొంతమంది అక్రమ మార్గంలో అర్హత లేకపోయినా పింఛన్లు పొందుతున్నారు. దీంతో వీరి పింఛన్లకు ముప్పు ఏర్పడే అవకాశముంది. దీంతో అనర్హులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం చేపడుతోంది. గతంలో తనిఖీలు చేపట్టగా.. కొంతమంది అనర్హులను గుర్తించింది. ఇక నుంచి కలెక్టర్లకే పూర్తి అధికారులు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.