AP Weather: ఏపీకి తుఫాన్ ముప్పు.. భారీ వర్షసూచన.. ప్రభావిత జిల్లాలివే..!
బంగాళాఖాతంలో ఏర్పడబోయే తుఫాను నేపథ్యంలో.. భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే పంటలు చేతికి వచ్చిన సమయం కావడంతో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు డిసెంబర్ మొదటి వారంలోనే తుఫాను ప్రభావం చూపుతున్న నేపథ్యంలో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు ఆ సమయానికి తిరలకు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

దక్షిణ అండమాన్ దానికి అనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. సుస్పష్టమైన అల్పపీడనంగా కొనసాగుతోంది. ఈ తీవ్ర అల్పపీడనం కాస్త పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడుతుంది. వాయువ్యదిశగా కదులుతూ నైరుతి దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడి.. డిసెంబర్ రెండో తేదీ కల్లా తుఫాన్ గా మారుతుంది. తుఫాన్ గా మారితే దానికి ‘మిచౌంగ్’ గా నామకరణం చేస్తారు.
వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారంటే..
– రెండో తేదీ కల్లా తుఫాను ఏర్పడుతుందని.. అప్పటినుంచే ఏపీపై తుఫాను ప్రభావం చూపుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనంగానే ఉందని… వాయుగుండంగా బలపడుతుందని అన్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడి ప్రవేశిస్తుందని… ఆ తరువాత దాని గమనాన్ని బట్టి ప్రభావం తీవ్రతను అంచనా వేయాల్సి ఉంటుందన్నారు. తుఫాను దిశ మార్చుకునే అవకాశాల్లో కూడా లేకపోలేదన్నారు. ప్రస్తుతం ఉన్న గమనం ప్రకారమే తుఫానుగా మారి తీవ్రం వైపు వస్తే ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంటున్నారు. డిసెంబర్ మొదటి వారంలో.. నాలుగైదు రోజుల పాటు తుఫాను ప్రభావం ఏపీపై ఉంటుందన్నారు. తుఫాను తీరం దగ్గరకు వచ్చే కొద్దీ దాని ప్రభావం మరింత పెరుగుతుందని చెప్పారు సునంద. ఏపీ కోస్తా వైపు తుఫాను వస్తున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కోస్తా లో కురుస్తాయని.. ఆ సమయంలో మత్స్యకారులకు బయటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తామన్నారు. గాలుల తీవ్రత 45 నుంచి గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగం కూడా విచే అవకాశం ఉందన్నారు. తుఫాను దిశ గమనాన్ని బట్టి ఎక్కడ తీరం దాటుతుందని విషయం అంచనా వేయాల్సి ఉంటుందన్నారు సునంద.
ఏ ఏ జిల్లాలపై తుఫాను ప్రభావం..!
– ఒకవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తుఫాన్గా మారబోతోంది. ఆ ప్రభావం రెండో తేదీ నుంచి ఏపీపై ఉంటుంది.అమరావతి వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం.. డిసెంబర్ రెండో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఏపీ పై తుఫాను ఎఫెక్ట్ ఉంటుంది.
2 వ తేదీన:
– దక్షిణ కోస్తా లోని నెల్లూరు, రాయలసీమలోని తిరుపతి చిత్తూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు
3వ తేదీన :
– తిరుపతి, చిత్తూరు, నెల్లూరులో జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ప్రకాశం, వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య జిల్లాల్లోనూ వర్షాల ప్రభావం
4వ తేదీన :
– తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, గుంటూరు, పల్నాడు, వైయస్సార్, అన్నమయ్య, నంద్యాల, ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు
5వ తేదీన :
– ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణ, గుంటూరు, పల్నాడు, వెస్ట్ గోదావరి,, కోనసీమ, బాపట్ల, ఈస్ట్ గోదావరి, కాకినాడ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు భారీ వర్ష సూచన
– మత్స్యకారులు, రైతులకు సూచనలు..
– బంగాళాఖాతంలో ఏర్పడబోయే తుఫాను నేపథ్యంలో.. భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే పంటలు చేతికి వచ్చిన సమయం కావడంతో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు డిసెంబర్ మొదటి వారంలోనే తుఫాను ప్రభావం చూపుతున్న నేపథ్యంలో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు ఆ సమయానికి తిరలకు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. రెండో తేదీ నుంచి సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ అవుతాయి.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కారణం..
– అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తీస్తున్న గాలులే కారణమని అధికారులు చెబుతున్నారు. కోస్తా రాయలసీమ జిల్లాల్లో రెండు మూడు రోజులపాటు ఉరుములతో కూడిన జల్లులలో లేదా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..