కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. యుద్ధం వస్తే కేటగిరీ-2 హిట్లిస్ట్లో హైదరాబాద్, వైజాగ్
భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ వేగంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. POKలో ఉగ్రమూకల నివాసాలే టార్గెట్గా విరుచుకుపడింది. దాంతో.. పాకిస్తాన్లో అలజడి రేగుతోంది. ఇది మరింత పీక్ స్టేజ్కు చేరి భారత్- పాక్ మధ్య యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి?.. దేశంలోని ఏఏ ప్రదేశాలను పాకిస్తాన్ టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది?.. అందులోనూ తెలుగు రాష్ట్రాలపై ఏ మేరకు ప్రభావం ఉంటుంది?.. అనే అంశాలు ఆసక్తి రేపుతున్నాయి.

భారత్- పాక్ వార్ ప్రకంపనల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ హైలెవల్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా.. దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను 3 కేటగిరీలుగా విభజించారు. మెట్రో, డిఫెన్స్, పోర్ట్స్, ఎనర్జీ హబ్స్ వారీగా డివిజన్ చేశారు. ఈ లెక్కన.. కేటగిరి-1లో దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలోని తారాపూర్ న్యూక్లియర్ ప్లాంట్ను చేర్చారు. ఢిల్లీలో దాదాపు అన్ని విభాగాల ప్రధాన కార్యాలయాలు ఉండడంతో అదే పాకిస్తాన్కు మెయిన్ టార్గెట్గా భావించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, సూరత్, వడోదరతో పాటు.. అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న పలు నగరాలు కేటగిరి-1లో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్, వైజాగ్లు కేటగిరి-2లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ యుద్ధమే ప్రారంభమైతే.. పాకిస్తాన్ ప్రధానంగా టార్గెట్ చేసే ప్రాంతాల్లో హైదరాబాద్, విశాఖ ఉండడంతో ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అలెర్ట్ అవుతోంది. హైదరాబాద్లో రక్షణ పరిశోధన రంగాలకు చెందిన DRDO, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ, అడ్వాన్స్డ్ హైపర్సోనిక్ విండ్ టన్నెల్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ.. లాంటి అనేక రక్షణ రంగానికి చెందిన సంస్థలు ఉన్నాయి. ఇవి అగ్ని, పృథ్వీ, ఆకాశ్, బ్రహ్మోస్ వంటి క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. కేటగిరీ-2 హిట్లిస్ట్లో హైదరాబాద్ ఒకటిగా చేరింది.
మరోవైపు.. యుద్ధం వస్తే కేటగిరీ-2 హిట్లిస్టులో విశాఖపట్నం కూడా ఉండడం హాట్టాపిక్గా మారుతోంది. విశాఖలోనూ భారత రక్షణ రంగానికి చెందిన సంస్థలు ఉండడంతో కీలకంగా స్థానాన్ని సంపాదించింది. ప్రధానంగా.. విశాఖ తూర్పు నౌకా కమాండ్కు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది ఇండియన్ నేవీలో అతి ముఖ్యమైన కమాండ్లలో ఒకటిగా ఉంది. దీని ద్వారా తూర్పు తీరం, బంగాళాఖాతంలో సముద్ర రక్షణ కార్యకలాపాలు నిర్వహించబడతాయి.
హిందుస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్, నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాబొరేటరీ, నావల్ డాక్యార్డ్, మేనేజ్మెంట్ అండ్ ఆర్మమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటి కీలక సంస్థలు ఉన్నాయి. వీటితోపాటు విశాఖలో DRDO యుద్ధ విమానాలు, నౌకలు, హెలికాప్టర్ల కోసం పరికరాల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిలోనే.. సైబర్ టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తోంది.