Anna Canteens: ఆధార్, రేషన్ కార్డులు అవసరం లేదు.. రూ.5తోనే జనం ఆకలి తీర్చే అద్భుత పథకం..!

|

Aug 16, 2024 | 3:12 PM

ఇక్కడ భోజనం చేయడానికి అర్హత అక్కర్లేదు. రేషన్ కార్డు చూపించక్కర్లేదు. కడుపులో ఆకలి, చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు.. అన్న క్యాంటీన్లోకి అడుగుపెట్టొచ్చు. ఓ పెద్ద హోటల్‌ అందించేంత మెనూతో, అత్యంత శుభ్రతతో భోజనం వడ్డిస్తారు. కూలీలు, కార్మికులు, డ్రైవర్లు, వీధుల్లో షాపులు నడిపించేవారు..

Anna Canteens: ఆధార్, రేషన్ కార్డులు అవసరం లేదు.. రూ.5తోనే జనం ఆకలి తీర్చే అద్భుత పథకం..!
Anna Canteen Menu
Follow us on

అమ్మ.. అన్న..పేరు ఏదైతేనేం.. పేదోళ్ల కడుపులు నింపడానికి… ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా… తాము పెట్టుకున్న గడువుకున్నా ముందే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పేరుతో తీసుకొచ్చిన పథకం అన్న క్యాంటీన్లు. ఇక్కడ భోజనం చేయడానికి అర్హత అక్కర్లేదు. రేషన్ కార్డు చూపించక్కర్లేదు. కడుపులో ఆకలి, చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు.. అన్న క్యాంటీన్లోకి అడుగుపెట్టొచ్చు. ఓ పెద్ద హోటల్‌ అందించేంత మెనూతో, అత్యంత శుభ్రతతో భోజనం వడ్డిస్తారు. నిజానికి గతంలోనే కూలీలు, కార్మికులు, డ్రైవర్లు, వీధుల్లో షాపులు నడిపించేవారు.. ఇలా ఎంతో మంది పేదల ఆకలి తీర్చింది అన్న క్యాంటిన్. జస్ట్‌ 5 రూపాయలకే పరిశుభ్రమైన ఆహారం దొరుకుతూ ఉండటంతో పెద్ద సంఖ్యలో పేదలు వీటిని ఉపయోగించుకున్నారు.  ఆ తర్వాత ఐదేళ్లు వీటికి బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది. ఉద్దేశం ఏదైనా.. రాజకీయంగా ఎవరెన్ని కామెంట్లు చేసినా.. పట్టణాల్లోని పేద, దిగువ మధ్యతరగతి వారి ఆకలిబాధ తీర్చాయి అన్న క్యాంటీన్లు. అందులో ఎలాంటి సందేహాలు లేవు.

అక్షయపాత్ర సహకారం

అన్న క్యాంటీన్లలో కేవలం ప్రభుత్వ పాత్ర మాత్రమే లేదు. ఒకరకంగా అన్న క్యాంటీన్ బిల్డింగ్ కట్టించి, భోజనాలు తీసుకొచ్చే హాట్ బాక్స్‌లను మాత్రమే ప్రభుత్వం అరేంజ్ చేస్తుంది. ఆహారం రుచికరంగా వండి సమయానికి తగ్గట్టుగా ట్రాన్స్‌పోర్ట్‌తో సహా తీసుకొచ్చేది మాత్రం హరే కృష్ణ మూమెంట్‌కు చెందిన అక్షయ పాత్ర సంస్థ. బియ్యం కొనటం, వండటం, రుచికరంగా కూరలు వండి జాగ్రత్తగా తీసుకురావడం.. ఈ బాధ్యత తీసుకుంటోంది అక్షయపాత్ర ఫౌండేషన్. పైగా అన్న క్యాంటీన్ల విషయంలో ప్రభుత్వం ఖర్చు పెట్టేది చాలా తక్కువ. రోజుకు ఒక్కో మనిషికి మూడు పూటలకు కలిపి 90 రూపాయలు ఖర్చు అవుతుండగా 15 రూపాయలు మాత్రమే పేదవారి నుంచి కట్టించుకుని.. మిగతా 75 రూపాయలను ప్రభుత్వమే చెల్లించనుంది. మూడు పూటలా కలిపి రోజూ లక్షా 5వేల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు. ఉదయం 35వేల మందికి టిఫిన్‌ అందిస్తారు. అంతే స్థాయిలో 35వేల మందికి మధ్యాహ్నం, 35 వేల మందికి రాత్రి సమయంలో భోజనం పెడతారు. ఒక్కో క్యాంటీన్లో సుమారు 350 మందికి సరిపడా ఆహారాన్ని మూడు పూటలా అందుబాటులో ఉంచుతారు.

ఏటా రూ.200 కోట్లు ఖర్చు !

ఎన్ని సంక్షేమ పథకాలున్నా.. పేదల కడుపు నింపుతున్నది మాత్రం అన్నక్యాంటీనే. ప్రస్తుత లెక్కల ప్రకారం ఏడాదికి సుమారు 200 కోట్ల రూపాయలు దీనికి ఖర్చవుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, ఈ కార్యక్రమం కోసం విరాళాలు సేకరిస్తోంది ప్రభుత్వం. స్వయంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. తెలుగు ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందుకురావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

“అనవసర ఖర్చులు, ఆడంబరాలు, పెళ్లి ఖర్చులు తగ్గించుకొని అన్న క్యాంటీన్‌ ట్రస్టుకు విరాళాలివ్వండి. సేవ చెయ్యాలన్న ఆలోచనతో దాతలు ముందుకు రావాలి. మీరు మంచి పనికోసం 10 రూపాయలు ఖర్చు పెడితే.. మీ ఆదాయం 100 రూపాయలు పెరుగుతుంది. విరాళాలిచ్చేందుకు మరింత సౌకర్యంగా ఉండేందుకు డిజిటల్‌ విరాళాల స్వీకరణకు కూడా ఏర్పాట్లు చేశాం” అని చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా దాతలకు పిలుపునిచ్చారు.

Chandra Babu on Anna Canteen

విరాళాల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా

బుధవారం ఒక్కరోజేప్రభుత్వానికి అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం సుమారు రూ.2కోట్లకు పైగా విరాళాలను దాతలు అందించారు. దీంతో ఇలా సేకరించిన విరాళాలకు అకౌంట్‌బులిటీ ఉండాలనే ఉద్దేశంతో ఎస్‌బిఐలో ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచింది ప్రభుత్వం. ఎవరైనా విరాళాలు అందించాలనుకుంటే ఆ ఖాతాకు కూడా నేరుగా పంపించవచ్చు.

అన్న క్యాంటీన్ల విరాళాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు

ఖాతా పేరు: అన్న క్యాంటీన్స్ (ANNA CANTEENS)

ఖాతా నెంబర్: 37818165097

బ్రాంచి: చంద్రమౌళినగర్, గుంటూరు

ఐఎఫ్‌ఎస్‌సి కోడ్: SBIN0020541

Bank Account Details

రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోగా ప్రారంభించాలన్నది ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా ఇప్పటికే 100 క్యాంటీన్లు మొదలయ్యాయి. సెప్టెంబర్‌ మొదటి వారానికల్లా మిగతా వాటిని కూడా ప్రారంభిస్తామని ఏపీ సీఎం చెప్పారు.

అన్న క్యాంటీన్లను ట్రస్టు ద్వారా శాశ్వతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే గిరిజన ప్రాంతాల్లో మండలానికో అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తాం” అని చంద్రబాబు ప్రకటించారు.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Chandra Babu

అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో తయారీ

అక్షయపాత్ర సంస్థలో వంటలు వండే భారీ కిచెన్‌ను మంత్రి నారాయణ సందర్శించారు. పరిశుభ్రమైన వాతావరణంలో అన్నం వండే విధానాన్ని, కూరగాయలు తరిగే విధానం, కూరలు వండే విధానం, ప్యాకింగ్‌ ఎలా చేస్తారనే అంశాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.అక్షయ పాత్ర ఆధ్వర్యంలో సిద్ధమవుతున్న ఆహార పదార్థాల నాణ్యత, ప్యాకింగ్ తదితర అంశాలను పరిశీలించిన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

మెనూ ఇదే..

ఇక అన్న క్యాంటీన్ల మెనూ విషయానికొస్తే . సోమవారం నుంచి శనివారం వరకు రోజూ ఉదయం టిఫిన్‌లో భాగంగా.. ఇడ్లీ-చట్నీ లేదా పొడి, సాంబార్‌ అందిస్తారు. ఇడ్లీతోపాటు సోమవారం, గురువారం పూరీ-కుర్మా, మంగళవారం, శుక్రవారం ఉప్మా-చట్నీ, బుధవారం, శనివారం పొంగల్‌-చట్నీ, మిక్చర్‌ అందుబాటులో ఉంటాయి. ఇడ్లీ వద్దనుకునే వారు ప్రత్యామ్నాయంగా పూరీ, ఉప్మా, పొంగల్‌ తీసుకోవచ్చు. ఇక సోమవారం నుంచి శనివారం వరకు రోజూ మధ్యాహ్నం, రాత్రి అన్నంతోపాటు కూర, పప్పు లేదా సాంబారు, పెరుగు, పచ్చడి అందిస్తారు. వారానికోసారి ప్రత్యేక ఆహారం అందిస్తారు. మూడు ఇడ్లీలు, 400 గ్రాముల అన్నం, సాంబార్‌, పప్పు 120 గ్రాములు, 100 గ్రాముల కూర, 75 గ్రాముల పెరుగు, 15 గ్రాముల ఊరగాయ అందుబాటులో ఉంటుంది. అన్న క్యాంటీన్లు పేద, దిగువ మధ్య తరగతి వారితో డైరెక్టుగా కనెక్ట్‌ అయి ఉన్నాయి. అందుకే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలామంది టీడీపీ నేతలు అన్న క్యాంటీన్లను సొంతంగా నిర్వహించారు. ప్రజల సెంటిమెంట్‌ గ్రహించిన టీడీపీ.. అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినట్టుగానే ప్రారంభించింది.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

రోజుకు అయ్యే ఖర్చు

ఏపీ సరే తెలంగాణలో పరిస్థితి ఏంటి?

తెలంగాణలో అన్న పూర్ణ పేరుతో 5 రూపాయలకే భోజనం పథకాన్ని 2014లోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. పేద, మధ్యతరగతి జనం, అలాగే కార్మికులు, ఆటో,క్యాబ్ డ్రైవర్లు, చిన్న చిన్న ఉద్యోగులు, విద్యార్థులకు 5 రూపాయలకే భోజన పథకం ఒక వరంగా మారింది. తెలంగాణలో కూడా హరేకృష్ణ చారిటీస్‌కి చెందిన అక్షయ పాత్ర ద్వారానే భోజనం అందిస్తున్నారు. మొదట 8 కేంద్రాలలో రోజూ 2400 మందికి భోజనం అందించేలా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. హరేకృష్ణ ఛారిటీస్ తన వెబ్ సైట్లో ప్రస్తావించిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ నగరంలోనే 175కి పైగా కేంద్రాలలో రోజుకు 40 వేలకు పైగా భోజనాలను 5 రూపాయలకే అందిస్తున్నారు.

2019లో ఈ పథకాన్ని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రారంభించారు. అక్కడ కూడా రోజుకు 40 వేల భోజనాలను అందించే ఏర్పాట్లు చేశారు. 2020లో జీహెచ్ఎంసీ పరిధిలోని వలస కార్మికులకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, 5 రూపాయల భోజనాన్ని ఇంటివద్దకే తీసుకెళ్లి అందించేలా మొబైల్ క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక కోవిడ్ సమయంలో 350 కేంద్రాలలో రోజుకు రెండున్నర లక్షల మందికి 5 రూపాయలకే భోజనాన్ని సుమారు 3 నెలల అందించారు. ఆ సమయంలో అక్షయపాత్ర కిచెన్ సెంటర్ 24 గంటలు పని చేసి తన సేవా భావాన్ని చాటుకుంది. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ సేవలు మొదలయ్యాయి. తాజాగా తెలంగాణ సచివాలయంలో కూడా ఈ సేవల్ని ప్రారంభించారు.

అమ్మ క్యాంటీన్లే ఆదర్శమా..?

తమిళనాడులోనూ అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. 2013లోనే నాటి జయలలిత ప్రభుత్వం వీటిని ప్రారంభించింది. ప్రభుత్వం మారి స్టాలిన్‌ ముఖ్యమంత్రి అయ్యాక.. ‘అమ్మ’ పేరు మార్చమంటారా అని అడిగారు అధికారులు. జయలలిత ప్రారంభించిన క్యాంటీన్లను పేరుతో సహా అలాగే కొనసాగించండని ఆదేశాలిచ్చారు స్టాలిన్. 2014లో విభజిత ఏపీ రాష్ట్రంలో నాటి తెలుగు దేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. దీనిపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. పట్టణాల్లో పేదలకు పట్టెడన్నం పెట్టే క్యాంటీన్లు మూసివేడడం ఎందుని, పేరు మార్చి కొనసాగించాలని ఎంతోమంది కోరారు. కాని, జగన్ ప్రభుత్వం మాత్రం అన్న క్యాంటీన్ల మూసివేతకే నిర్ణయించింది.

400 కోట్లకు పైగా భోజనాలు

ఇక హరేకృష్ణ ఛారిటబుల్‌ సంస్థ విషయానికొస్తే అక్షయపాత్రతో కలిసి రోజుకు 23 లక్షల మందికి ఆహారం అందిస్తున్నారు. 11 ప్రాంతాల్లో కేంద్రీయ వంటశాలలు ఉన్నాయి. ఆధునిక పరికరాలు వినియోగిస్తున్నారు. ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలల్లో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకానికి కూడా భోజనాలను అందిస్తోంది అక్షయపాత్ర. 2024 ఫిబ్రవరి వరకు సుమారు 400 కోట్లకు పైగా భోజనాలను వండి వడ్డించింది.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి