Andhra Pradesh: సీపీఎస్‌పై మరోసారి గళం విప్పేందుకు సిద్ధమైన ఏపీ ఉద్యోగులు.. ఛలో విజయవాడపై టెన్షన్.. టెన్షన్..

సెప్టెంబర్ 1వ తేదీన చలో విజయవాడ, సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు ఉద్యోగ సంఘాల నేతలు. కొత్త విధానంతో సీపీఎస్ కంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నది ప్రభుత్వ వాదన.

Andhra Pradesh: సీపీఎస్‌పై మరోసారి గళం విప్పేందుకు సిద్ధమైన ఏపీ ఉద్యోగులు.. ఛలో విజయవాడపై టెన్షన్.. టెన్షన్..
Apcps

Updated on: Aug 28, 2022 | 9:52 AM

Chalo Vijayawada tension: ఏపీలో జీపీఎస్ (Guaranteed Pension Scheme) విధానంపై భగ్గుమంటున్న ఉద్యోగ సంఘాలు పోరుబాట పడుతున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీన చలో విజయవాడ, సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు ఉద్యోగ సంఘాల నేతలు. కొత్త విధానంతో సీపీఎస్ కంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నది ప్రభుత్వ వాదన. ఆర్థిక భారం వల్ల పాత విధానం అమలు కష్టమని రెండు రోజుల జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాలతో (AP Govt Employees) మంత్రులు స్పష్టం చేశారు. జీపీఎస్ విధానంలో అవసరం అయితే మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రులు. అయితే ఉద్యోగులు మాత్రం ససేమిరా అంటున్నారు. పాత పెన్షన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌1 చలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి పర్మిషన్‌ లేదంటూ సీపీ కాంతి రాణా టాటా తేల్చిచెప్పారు. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ క్రమంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనిపై విజయనగరంలో స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగ సంఘాలు సమస్యలపై పోరాటం చేసే హక్కు వారికుంది, అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ స్పష్టం చేశారు. సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తే ఊరుకుంటామా అంటూ కామెంట్ చేశారు మంత్రి బొత్స. సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందే హమీ ఇచ్చామన్న మంత్రి.. సిపిఎస్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొత్త స్కీమ్ ప్రతిపాదన పెట్టామని వివరించారు. కొత్త స్కీమ్ సిపిఎస్ ను మించి ఉంటుంది, సమస్యను అందరూ సానుకూలంగా అర్థం చేసుకోవాలంటూ మంత్రి విజ్ఞప్తి చేశారు. ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అన్ని శాఖల్లో అమలుచేస్తామని మరోసారి కుండబద్ధలు కొట్టారు.

తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్న మంత్రి బొత్స రాష్ట్ర ప్రజల్లో వాళ్లు కూడా భాగస్వాములు అంటూ కామెంట్ చేశారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తున్న మంత్రి ఏనాడూ చిన్న చూపు చూడలేదంటున్నారు. మొత్తంగా సెప్టెంబర్‌ ఒకటి తేదీన ఏం జరగబోతుంది? ఆందోళనలు విరమణకు ప్రభుత్వం నుంచి ఏదైన ప్రకటన వస్తుందా అన్న ఉత్కంఠ అయితే ఏపీలో కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి