Andhra Pradesh: మనిషి రూపంలో శివలింగం.. ఏడవ శతాబ్దం నాటి అద్భుత ఆలయం గురించి తెలుసా..?
సాధారణంగా ఏ శివాలయానికి వెళ్లినా మనకు దర్శనమిచ్చేది ఆ పరమేశ్వరుడి లింగ రూపం. కానీ మీరు ఎప్పుడైనా నిలువెత్తు విగ్రహ రూపంలో ఉన్న శివుడిని చూశారా..? లింగాభిషేకాలకు బదులు ఆ మానవ రూపానికే అభిషేకాలు జరిగే అరుదైన క్షేత్రం గురించి విన్నారా..? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశంలో ఎటు చూసినా శివుడు లింగాకారంలోని దర్శనం ఇస్తాడు. కానీ అక్కడ మాత్రం శివుడి మనిషి రూపంలో విగ్రహం ఉంటుంది. ఎక్కడ చూసినా శివాలయంలో శివలింగానికి పూజలు చేస్తుంటే.. అక్కడ మాత్రం నిలువెత్తు శివుడి విగ్రహానికి పూజలు చేస్తారు.. శ్రీ సత్య సాయి జిల్లా అమలాపురం మండలం హేమావతి గ్రామంలో మానవాకారంలో శివుడు భక్తులకు దర్శనమిస్తాడు. లింగ రూపంలో కాకుండా మానవాకారంలో శివుడు విగ్రహం ఉండడమే హేమావతి శివాలయం ప్రత్యేకత. దేశవ్యాప్తంగా శివరాత్రి పర్వదినాన లింగాభిషేకాలు శివలింగానికి పూజలు చేస్తుంటే.. ఈ శివరాత్రి పర్వదినాన హేమావతి శివాలయంలో నిలువెత్తు పరమేశ్వరుడి విగ్రహానికి పూజలు చేస్తుంటారు. దక్షిణ కాశీగా పిలవబడే హేమావతి శివాలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఏడవ శతాబ్దంలో నొలంబరాజుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. నొలంబరాజుకు సంతానం లేకపోవడంతో శివుడిన్ని పూజించగా శివుడు కలలో కనిపించి తనకు లింగాకారంలో కాకుండా మానవాకారంలో విగ్రహాన్ని ప్రతిష్టించాలని నొలంబరాజును శివుడు ఆజ్ఞాపించారట. శివుడి ఆజ్ఞతో నొలంబరాజు మానవాకారంలో శివుడి విగ్రహాన్ని ప్రతిష్టించడంతో ఆడ సంతానం కలిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. అలా హేమావతిలో మానవాకారంలో శివుడి విగ్రహానికి అప్పటినుంచి పూజలు చేస్తూ వస్తున్నారు భక్తులు…
ప్రతి శివరాత్రి పర్వదినాన మానవ రూపంలో ఉన్న శివుని దర్శించుకోవడానికి మడకశిర చుట్టుపక్కల ప్రాంతం నుంచే కాకుండా సరిహద్దు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వేలాది మంది భక్తులు హేమావతి పరమేశ్వరుని దర్శించుకునేందుకు వస్తారు. ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా హేమావతి గ్రామంలో ఏడు రోజులు పాటు శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు శివుడి అభిషేకం, అగ్నిగుండం చూసేందుకే పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.
