తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో తెలంగాణ వ్యాప్తంగా 70శాతం పైన 40 డిగ్రీలకుపైగా టెంపరేచర్ నమోదవుతోంది. ఉత్తర తెలంగాణలో 42, 43 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని నిర్మల్ జిల్లా నర్సాపూర్లో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజులపాటు హీట్ వేవ్ పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది.
కోస్తాంధ్ర, రాయలసీమలో పెరిగిన టెంపరేచర్
ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4-6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అన్ని చోట్లా పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైగానే నమోదవుతోంది. మరో 3 రోజులపాటు భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీలో పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నైరుతిగాలులు, ఎల్నినో ప్రభావంతో జూన్ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పాఠశాలలో విద్యార్థులకు 3 సార్లు వాటర్ బ్రేక్
ఏపీ, తెలంగాణలో గురువారం నుంచి పగటిపూట ఉష్ణోగత్రలు మరింత పెరగనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. వడగాల్పులు కూడా తీవ్రంగా ఉంటాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక ఎండల నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు కనీసం మూడుసార్లు వాటర్ బ్రేక్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏప్రిల్, మే, జూన్లోనూ అధిక ఎండల ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
వృద్దులు, పిల్లలు, వీధి వ్యాపారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీలయినంతవరకూ ఓర్ఎస్, చలువ చేసే ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..