Andhra Pradesh: గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో మల్టీసూపర్‌ స్పెషాలిటీ సేవలకు ప్లాన్‌ః సత్యకుమార్

| Edited By: Balaraju Goud

Aug 17, 2024 | 8:47 AM

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్య సంఘాలతో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ చర్చలు జరిపారు. దశలవారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పడంతో ఆరోగ్యశ్రీ సేవలు ఆపబోమని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు

Andhra Pradesh: గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో మల్టీసూపర్‌ స్పెషాలిటీ సేవలకు ప్లాన్‌ః సత్యకుమార్
Ap Minister Satya Kumar
Follow us on

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్య సంఘాలతో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ చర్చలు జరిపారు. దశలవారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పడంతో ఆరోగ్యశ్రీ సేవలు ఆపబోమని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. అటు.. ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లోనూ పూర్తిస్థాయిలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌. అమరావతిలోని సచివాలయంలో ఆరోగ్యశ్రీ అనుబంధ ఆస్పత్రుల యాజమాన్య సంఘం నేతలతో సమావేశమైన ఆయన.. పెండింగ్ బకాయిల చెల్లింపుపై చర్చించారు. దశలవారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పడంతో ఆరోగ్యశ్రీ సేవలు ఆపబోమని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

ఇక. హెల్త్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు మంత్రి సత్యకుమర్. ప్రభుత్వాస్పత్రుల్లో 3100 డాక్టర్లు, టెస్టులకు సంబంధించి అత్యాధునిక పరికరాల కొరత ఉన్నాయని చెప్పారు. చివరికి స్ట్రెచర్స్‌, వీల్‌చైర్ల లాంటి చిన్నచిన్న అంశాలు కూడా ప్రభుత్వాస్పత్రుల వైద్య సేవల నిర్వహణకు సవాళ్లుగా మారాయన్నారు మంత్రి సత్యకుమార్‌. ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులు పూర్తిస్థాయిలో మారాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాదు.. వైద్య సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు.. కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎండ్రోక్రైనాలజీ, క్యాన్సర్‌ కేర్‌, రేడియోఆంకాలజీ, రేడియోథెరపీ, సర్జికల్‌ ఆంకాలజీ లాంటి మల్టీ సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పారు. అడ్వాన్స్‌ పరికరాలు తీసుకురావడంతోపాటు.. ఆర్గాన్స్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేందుకు అవసరమైన డిజిటల్‌ లైబ్రరీ కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. బోధనాస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు.. ప్రజల్లో నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన సేవలు అందించమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. అనారోగ్యం వస్తే ప్రజలు ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులుపెట్టకుండా.. ప్రభుత్వాస్పత్రులకు వెళ్తే అన్ని వైద్య సేవలు అందుతాయనే నమ్మకం కల్పించాల్సి అవసరం ఉందన్నారు మంత్రి సత్యకుమార్‌.

పారిశుద్ధ్యం పై ఫోకస్

ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రల్లో పారిశుద్య కార్యక్రమాలను మెరుగుపర్చి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి సూచించారు. ఓపీ సేవల్లో ఎటు వంటి అవాంతరాలు లేకుండా చూడాలన్నారు. రోగులకు సహకరించేందుకు హెల్త్ డెస్కులు ఏర్పాటు చేయడం, వైద్యులు, రోగనిర్ధారణ పరికరాలు, యంత్రాల పనితీరును పర్యవేక్షించడం, అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చుకోవాలని మంత్రి కోరారు. వైద్యాధికారులు, సిబ్బంది కొరత నివారణకై ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, సూపర్ స్పెషాలిటీ సేవలతో పాటు అధునాతన శస్త్ర చికిత్సలు, అవయవ మార్పిడి చికిత్సలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 వేల వైద్యాధికారుల సేవలు అవసరం ఉండగా, ప్రస్తుతం 3,100 వైద్యాధికారుల కొరత ఉందని మంత్రి తెలిపారు. ఆ కొరత నివారణకు ఖాళీ పోస్టుల భర్తీకి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడు నుండి ఆరు మాసాల కాల వ్యవధిలో స్వల్పకాలిక ప్రణాళికను, ఏడాది వ్యవధిలో మధ్యకాలిక ప్రణాళికను అమలు చేయడంతో పాటు దీర్ఝకాలిక ప్రణాళిక అమల్లో భాగంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

దశలవారీగా ఆసుపత్రులకు చికిత్స

అనారోగ్యంపాలైన హాస్పిటల్స్ కి చికిత్స అందించాలని సత్య కుమార్ ప్రణాళిక రూపొందించారు. స్వల్పకాలిక ప్రణాళిక అమల్లో భాగంగా ఆసుప‌త్రుల ప్రాంగ‌ణాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం, టాయిలెట్ల, బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ను ప‌టిష్టంగా నిర్వహించడం, స్ట్రెచ‌ర్లు, వీల్‌చైర్లు, మహాప్రస్థానం వాహనాలు అవసరం మేరకు సమకూర్చుకోవడం, మగ నర్సింగ్ ఆర్డర్లీ (ఎంఎన్ఓ)లు, మహిళా నర్సింగ్ ఆర్డర్లీ (ఎఫ్ఎన్ఓ)లు, ల్యాబ్, ఇతర సాంకేతిక నిపుణుల కొర‌త‌ను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీనియర్లు, స్పెషలిస్ట్ వైద్యులు తప్పనిసరిగా ఓపి విధులకు హాజరయ్యేలా చూడటం, టెస్టుల రిపోర్టు వివరాలు ఎస్.ఎం.ఎస్. ద్వారా రోగులకు తెలియజేయడం, ఆసుపత్రుల్లో అవినీతిని నియంత్రించేందుకై ‘104’ కి కాల్ చేసి ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించడం, 108 సర్వీస్ సిబ్బంది, క్యాజువాలిటీ వైద్యుల బృందం మధ్య సమర్ధవంతమైన సమన్వయం ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

అదే విధంగా దీర్ఘకాలిక ప్రణాళిక అమల్లో భాగంగా అన్ని ప్రభుత్వ స‌ర్వజ‌న ఆస్పత్రులలో కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో-ఎంటరాలజీ, ఎండోక్రైనాలజీ, క్యాన్సర్ కేర్ ( రేడియేషన్ ఆంకాలజీ, రేడియో థెరపీ, సర్జికల్ ఆంకాలజీ ) సూప‌ర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఎటు వంటి అంతరాయం ఉండదు..

ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఎటు వంటి అంతరాయం ఉండబోదన్నారు మంత్రి సత్యకుమార్. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లింపునకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి విడతలో రూ.162 కోట్లు, రెండో విడతలో నేడు రూ.200 కోట్లు ఇవ్వడం జరిగిందని, మరో వారం రోజుల్లో రూ.300 కోట్లు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోషియేషన్ దాదాపు 13 సార్లు నోటీసుల ఇచ్చినా సరే స్పందించలేదని, కానీ తమ ప్రభుత్వానికి ఒక సారి నోటీసు ఇచ్చిన వెంటనే స్పందిస్తూ ఆయా ప్రతినిధులతో పలు మార్లు చర్చలు జరిపి ఇప్పటి వరకూ దాదాపు రూ.662 కోట్లు చెల్లించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

ఈ పథకం క్రింద ఇప్పటి వరకూ దాదాపు రూ.2,100 కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లించాల్సి ఉందని, మరో రూ.400 కోట్లు అప్ లోడ్ చేయాల్సి ఉందన్నారు. మొత్తం మీద దాదాపు రూ.2,500 కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిలో ఇప్పటికే 35 శాతం మేర బకాయిలు చెల్లించడం జరిగిందన్నారు. అసోషియేషన్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రతి నెలా వారికి చెల్లింపులు చేసే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకోనున్నామని మంత్రి తెలిపారు. అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకవతకలపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని, ఎవర్నీ వదిలిపెట్టేదీ లేదని మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..