Guntur: మానవత్వం చాటుకున్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి..
కొండవీడు ఉత్సవాలకు హాజరై తిరుగు ప్రయాణంలో ఉన్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి.. రోడ్డుప్రమాదంలో గాయపడిన ముగ్గురికి వెంటనే ప్రథమ చికిత్స చేసి, తన సొంత వాహనంలో జీజీహెచ్కు తరలించారు. ప్రమాద సమయంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే మాధవికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం కొండవీడులో నిర్వహించిన ఉత్సవాలకు హాజరైన అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా.. ఫిరంగిపురం–కొండవీడు మధ్య రహదారిపై ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన విషయం ఆమె గమనించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గల్లా మాధవి ఆలస్యం చేయకుండా క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. రక్తస్రావంతో బాధపడుతున్న వారిని తక్షణమే తన సొంత వాహనంలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)కు తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను ఆమె ఆదేశించారు. బాధితులకు అవసరమైన అన్ని చికిత్సలు అందేలా వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఎలాంటి పరిచయం లేని తమను ప్రమాద సమయంలో ఆదుకుని ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే గల్లా మాధవికి క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధి అంటే కేవలం పాలనా బాధ్యతలే కాకుండా.. ప్రజల కష్టాల్లో అండగా నిలబడడమని ఎమ్మెల్యే మాధవి మరోసారి ఆచరణలో చూపించారని స్థానికులు ప్రశంసిస్తున్నారు.
Also Read: అక్కడ పది రోజుల పాటు చికెన్, ఎగ్స్ తినకపోవడం మంచిది..
