Nallari Kiran Kumar Reddy: కిరణ్‌పై కోపంగా కాంగ్రెస్ కేడర్.. ఆయన రీఎంట్రీ ఇస్తారా..? ఇంతటితో చాలించుకుంటారా..?

ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్‌ సీన్‌.. మాజీ సీఎం నల్లారి ఎటువైపు. కాంగ్రెస్‌లో మళ్లీ జవసత్వాలు నింపేందుకు ఆయన ప్రయత్నిస్తారా..? లేక ఇక రాజకీయాలకు రాం రాం చెప్పేస్తారా..? అన్నింటికి మరికొద్ది రోజుల్లో సమాధానం రానుంది.

Nallari Kiran Kumar Reddy: కిరణ్‌పై కోపంగా కాంగ్రెస్ కేడర్.. ఆయన రీఎంట్రీ ఇస్తారా..? ఇంతటితో చాలించుకుంటారా..?
Nallari Kiran Kumar Reddy - Rahul Gandhi

Updated on: Nov 19, 2022 | 3:48 PM

నల్లారి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వబోతున్నారా..? సెకండ్ ఇన్నింగ్స్‌కి ముహూర్తం పెట్టేశారా అంటే.. ఆయన అనుచరుల నుంచి అవుననే సిగ్నల్స్ వస్తున్నాయి. కిరణ్ నుంచి మాత్రం స్పష్టమైన ప్రకటన రావడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ విప్‌గా, స్పీకర్‌గా.. చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి… తన తండ్రి హయాం నుంచీ కాంగ్రెస్‌ వాదిగానే ఉన్నారు. అయితే, రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానంతో విభేదించారు కిరణ్‌. ఏపీ విభజనను చివరిదాకా ఆపేందుకు ప్రయత్నించి విఫలమైన ఆయన.. సీఎం పదవిని కూడా వదులుకున్నారు. విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నేతగా ఏపీ ప్రజల్లో ఒక ఇమేజ్‌ అయితే సంపాదించుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి… సమైక్యాంధ్ర పార్టీ స్థాపించినా విజయవంతం కాలేదు. 2014 ఎన్నికల తర్వాత రాజకీయంగా సైలెంటైన కిరణ్‌… విభజనను వ్యతిరేకించారే తప్ప ఎప్పుడూ కాంగ్రెస్‌ను విమర్శించలేదు. రాజకీయాలకు దూరంగా ఉన్నా.. కాంగ్రెస్‌ మనిషిగానే ఉన్నారు. 2018లో మళ్లీ రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు.

కాగా తిరిగి ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకోవాలంటే కిరణ్ కుమార్ లాంటి బలమైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీలో సీనియర్ నేత అయిన ఆయన సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలనే అభిప్రాయంలోనూ కాంగ్రెస్ అధిష్టానం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ పిలుపు మేరకు ఈ ఏడాది మేలో ఢిల్లీ వెళ్లిన కిరణ్.. దాదాపుగా 45 నిమిషాల పాటు ప‌లు అంశాల‌పై సోనియా గాంధీతో చ‌ర్చించారు. కానీ అందుకు సంబంధించిన డీటేల్స్ మాత్రం బయటకు రాలేదు. రాష్ట్ర పీసీసీ పగ్గాలు చేపట్టమని సోనియా అడిగారని.. తనకు ఏఐసీసీ పదవి కానీ, సిడబ్ల్యుసి మెంబర్ గాని, సౌత్ కాంగ్రెస్ ఇంచార్జ్ పదవి గాని కావాలని కిరణ్ కోరినట్లు ప్రచారం జరిగింది. కానీ ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత మళ్లీ కిరణ్ పూర్తిగా సైలెంటయ్యారు.

అయితే ప్రజంట్ కాంగ్రెస్ కేడర్ మాత్రం కిరణ్‌పై గుర్రుగా ఉంది.. ఇటీవల జోడో యాత్ర ఏపీలోకి ప్రవేశించినప్పుడు కిరణ్ పాల్గొనలేదు. కనీసం మద్దతు కూడా తెలపలేదు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న బాలయ్య అన్‌‌స్టాపబుల్ షోపై అందరి ఫోకస్ పడింది. అక్కడ అన్ని విషయాల గురించి చర్చించే ఉంటారు. కిరణ్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా..? ఆయన ఏపీ పాలిటిక్స్‌లో యాక్టివ్ అవుతారా..? తన వృద్ధికి కారణమైన కాంగ్రెస్‌కు మళ్లీ ఊపిరి పోసేందుకు పూనుకుంటారా..? లేదా మరో పార్టీని చూసుకుంటారా..? లేదా ఇక రాజకీయ సన్యాసమేనా అన్నది రానున్న అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌తో తేటతెల్లం కానుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us