AP News: బ్యాంకుకు కన్నం వేసేందుకు అర్థరాత్రి ముసుగుతో ఎంటరయిన మహిళ.. కట్ చేస్తే…

| Edited By: Ram Naramaneni

Aug 03, 2024 | 1:47 PM

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపిలోని యూనియన్‌ బ్యాంకులో ఓ మహిళ చోరీకి విఫలయత్నం చేసింది... తనతో పాటు ఓ మగమనిషిని వెంట తెచ్చుకుంది... తొలుత వీరిద్దరూ బ్యాంక్ షట్టర్ తాళం పగల కొట్టారు. అనంతరం ఆ వ్యక్తి బ్యాంక్ బయట కాపలా ఉండగా మహిళ లోపలకు వెళ్ళింది. ఆ తర్వాత...

AP News: బ్యాంకుకు కన్నం వేసేందుకు అర్థరాత్రి ముసుగుతో ఎంటరయిన మహిళ.. కట్ చేస్తే...
Theif
Follow us on

సాధారణంగా బ్యాంకుల్లో చోరీ చేసేందుకు ఆరితేరిన దొంగలు ప్రయత్నిస్తుంటారు… మరి బ్యాంకును కొల్లగొట్టాలంటే మామూలు విషయం కాదు  కదా. పక్కాగా ప్లాన్‌ వేయాలి… ఆ ప్లాన్‌ను అమలు చేసేందుకు రెక్కీ చేయాలి… బ్యాంకులు తెరిచి ఉన్న సమయంలో ఖాతాదారుడిలా వచ్చి పరిసరాలు పరిశీలించాలి… ఆ తరువాతే చోరీకి అనువుగా ఉన్న సమయం రాత్రి వేళల్లో కన్నం వేసి బ్యాంకులోకి ప్రవేశించాలి… ఆ తరువాత బ్యాంకు లాకర్లను లాఘవంగా తెరవాలి… అందినంత దోచుకోవాలి… ఇవన్నీ పకడ్బందీగా అమలు చేయాలంటే ఓ ముఠాను తయారు చేయాలి. ఇలాంటి ముఠాలు గురించి మనం వింటూ ఉంటాం.. సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే అంత ఓపిక, తీరిక నాకు లేదంటూ ఓ మహిళ బ్యాంకును దోచుకునేందుకు పక్కా ప్లాన్‌ వేసింది… చాలా తాపీగా బ్యాంకు షట్టర్‌ తాళం పగులగొట్టి లోపలికి వెళ్ళింది… తీరా బ్యాంకు లాకర్‌ తెరుచుకోకపోవడంతో నింపాదిగా అక్కడినుంచి వెళ్ళిపోయింది… ఇదంతా సిసి కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం ఆ మహిళా దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు..

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపిలోని యూనియన్‌ బ్యాంకులో ఓ మహిళ చోరీకి విఫలయత్నం చేసింది… తనతో పాటు ఓ మగమనిషిని వెంట తెచ్చుకుంది… తొలుత వీరిద్దరూ బ్యాంక్ షట్టర్ తాళం పగల కొట్టారు. అనంతరం ఆ వ్యక్తి బ్యాంక్ బయట కాపలా ఉండగా మహిళ లోపలకు వెళ్ళింది.. ముందుగా బ్యాంక్ లోపల సిసి కెమెరా వైర్‌ను కట్ చేసేందుకు ప్రయత్నించిన మహిళ, కెమెరా పక్కనే ఉన్న మరో వైర్‌ను కట్ చేసి ఇక తన పని మొదలుపెట్టింది… లాకర్‌ దగ్గరకు వెళ్ళి తెరిచేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఎంతకి బ్యాంక్ లాకర్ తెరుచుకోక పోవటంతో మూడు గంటల పాటు బ్యాంక్ లోపల కాలు కాలిన పిల్లిలా కలియతిరిగింది… చివరకు చేసేది ఏమి లేక ఉత్త చేతులతో బయటకు వెళ్లి పోయింది. ఉదయం షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండటం గమనించిన బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఆ తరువాత పోలీస్ లకు ఫిర్యాదు చెశారు… క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించారు. బ్యాంక్ లో ఎలాంటి సొత్తు అపహరణకు గురి కాక పోవడంతో బ్యాంక్ అధికారులు, ఖాతా దారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..