
పార్టీ నేతలు, ఎమ్మెల్యేల తీరుపై జనసేన జనరల్ బాడీ సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పదవులు తీసుకున్న నేతలు.. పార్టీ కోసం ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. పార్టీపైనా, తనపైనా అసత్య ఆరోపణలు జరుగుతుంటే నేతలు మౌనంగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు ప్రచారాలను ఎందుకు తిప్పికొట్టడం లేదని ప్రశ్నించారు. పార్టీ తరఫున గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు పవన్. పార్టీలో అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి. ఎవరేం చేస్తున్నారనే పూర్తి సమాచారం కూడా తన దగ్గర ఉందన్నారు. ఎవరు ఎంత పని చేస్తున్నారు? ఎవరు బాధ్యతలు నిర్వర్తించట్లేదో తనకు స్పష్టంగా తెలుసన్నారు. ఇకపై నేతల తీరు మారాల్సిందే. లేదంటే ఉపేక్షించేది లేదని హెచ్చరిక జారీ చేశారు. పార్టీ అభివృద్ధి, ప్రజల నమ్మకం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని పవన్ చెప్పారన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.
వైసీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అలాంటి వారి మాటలను తిప్పికొట్టాలంటూ పార్టీ నేతలకు పవన్ దిశానిర్దేశం చేశారు. దాడులు కాదు, అందుకు దారితీసిన పరిస్థితులపై మాట్లాడాలన్నారు. పార్టీలో క్రమశిక్షణ తప్పనిసరి అంటూ అల్టిమేటం జారీ చేశారు పవన్ కళ్యాణ్. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, పార్టీ లక్ష్యాల కోసం పనిచేసే వారికే జనసేనలో స్థానం ఉంటుందన్నారు. ఆరవ శ్రీధర్ వ్యవహారంపై విచారణకు పార్టీ కమిటీని నియమించింది. కమిటీ ముందు హాజరుకావాలని శ్రీధర్కు పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు.. 32 మందితో త్వరలోనే క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి నాదెండ్ల ప్రకటించారు. PAC ని పునరుద్ధరణ చేసి నిరంతరం కార్యక్రమాలను పర్యవేక్షించడమే కాకుండా.. కూటమిలో కష్టపడి, త్యాగాలు చేసిన వారికి న్యాయం చేస్తామన్నారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి.. మార్చి 14న పార్టీ ఆవిర్భావం దినోత్సవం లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేసేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.
ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..