తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలం రంపయెర్రంపాలెంలో అడవిదుప్పిపై ఊరకుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ ఘటన స్థానిక గంగాభవాని నగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. దారితప్పిన అడవిదుప్పి సమీపంలో ఉన్న మామిడి తోటలోకి రావడంతో కుక్కలు దాన్ని వేటాడి నడుం, పొట్ట భాగంపై తీవ్ర గాయాలు చేశాయి. దీనిని గమనించిన గ్రామ ప్రజలు వెంటనే ఫారెస్ట్ గార్డ్కు సమాచారాన్ని అందించారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని వెటర్నరీ డాక్టర్ల చేసే వైద్య సేవలు నిమిత్తం దుప్పిని తరలించారు.
అయితే వైద్య సేవలు అందించి తిరిగి వస్తున్న మార్గం మధ్యలోనే వన్యప్రాణి దుప్పి మరణించడంతో పోస్టుమార్టం నిమిత్తం వెటర్నరీ హాస్పిటల్కు తరలించారు. కుక్కల దాడి వలన అధికంగా రక్తస్రావం జరిగిందని, తద్వారా గుండె ఆగిపోవడంతో వన్యప్రాణి దుప్పి మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. దీనితో అటవీ శాఖ అధికారులు దాని దహన సంస్కారాలు పూర్తి చేశారు. కాగా, పలు గ్రామాల్లో కుక్కలు అధికంగా పెరిగిపోవడంతో ఎంతోమంది కుక్కకాటుకు బలైపోతున్నారని, మరికొందరికి రాబిస్ వ్యాధితో ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.
Also Read:
మందుబాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు.. వివరాలివే.!
మెడలో పాముతో వృద్ధుడు సైకిల్పై సవారీ.. వీడియో చూస్తే మీరూ ఔరా అనాల్సిందే!