Cyclone Mandous: మాండూస్ ఎఫెక్ట్.. తడిపిముద్దవుతోన్న తిరుమల.. భక్తుల రాకపోకలపై ఆంక్షలు..

| Edited By: Basha Shek

Updated on: Dec 10, 2022 | 7:26 PM

Cyclone in Andhra Pradesh : మహాబలిపురం దగ్గర తీరం దాటిన మాండూస్ తుపాను.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తీరప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.

Cyclone Mandous: మాండూస్ ఎఫెక్ట్.. తడిపిముద్దవుతోన్న తిరుమల.. భక్తుల రాకపోకలపై ఆంక్షలు..
Cyclone Alert

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారింది. ఈ తుఫాన్ కు మాండూస్ గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. తుపానుగా మారిన వాయుగుండం శనివారం తెల్లవారు జామున తీరం దాటింది. మహాబలిపురం సమీపంలో తీరందాటిందని తెలుస్తోంది. దీని ప్రభావంతో  శనివారం దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది.

తుపాను తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఈ తుపాను ప్రభావంతో మూడు రోజులపాటు.. దక్షిణ కోస్తాంధ్రాలోని ప్రకాశరం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. అలాగే, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Dec 2022 05:42 PM (IST)

    తిరుపతిలో కూలిన భారీ వృక్షం.. మహిళలకు గాయాలు..

    భారీ వర్షాలకు తిరుమలలోని ఏఎన్‌సీ ప్రాంతంలో భారీ వృక్షం విరిగిపడడంతో అక్కడే విధులు నిర్వహిస్తోన్న పారిశుద్ధ్య కార్మికురాలు గాయపడింది. ఆమెను వెంటనే అశ్విని ఆస్పత్రికి తరలించారు. వృక్షాన్ని తొలగించేందుకు తితిదే అధికారులు చర్యలు తీసుకున్నారు.

  • 10 Dec 2022 04:03 PM (IST)

    మాండూస్ పై సీఎం జగన్ సమీక్ష

    మాండూస్ తుపాను ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

  • 10 Dec 2022 02:59 PM (IST)

    తడిసి ముద్దవుతున్న తిరుమల..భక్తుల రాకపోకలు బంద్‌..

    మాండూస్‌ తుపాను ప్రభావం కారణంగా తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీవారి కొండ తడిసి ముద్దవుతోంది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో భక్తుల రాకపోకలను టీటీడీ నిలిపివేసింది. పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను ముందస్తుగా మూసివేసింది.

  • 10 Dec 2022 01:31 PM (IST)

    చెన్నైలో కుప్పకూలిన సెల్ ఫోన్ టవర్..

    మాండూస్ తుపాను తీవ్రత చెన్నై ఎక్కువగా ఉంది. ఈదురు గాలుల ధాటికి చెన్నైలో ఓ సెల్ ఫోన్ టవర్ కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన వీడియోను కింద చూడండి.

  • 10 Dec 2022 12:59 PM (IST)

    తిరుపతిలో సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు..

  • 10 Dec 2022 12:44 PM (IST)

    ప్రకాశంజిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..

    మాండూస్ తుఫాన్ ప్రభావంతో ప్రకాశంజిల్లాలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఒంగోలులో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జల్లులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కొత్తపట్నం, ఒంగోలు, సింగరాయకొండ, జరుగుమల్లి, నాగులుప్పలపాడు మండలాల్లోని సముద్రతీర ప్రాంతంలో సముద్రం భయానకంగా మారింది. అలల ఉధృతి పెరిగింది. రెండు రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్ళరాదని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో మత్స్యకారులు సముద్రం ఒడ్డునే ఉంటున్నారు.

  • 10 Dec 2022 12:15 PM (IST)

    సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు..

    సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం దగ్గర ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. తుఫాను కారణంగా ఒడ్డుకు రాలేక సముద్రంలోనే పడవను లంగరువేసి ఉంచారు మత్స్యకారులు. వీరు వేటపాలెం మండలం రామాపురానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ నెల 4వ తేదీన సముద్రంలో వేటకు వెళ్ళారు ఈ మత్స్యకారులు. తుఫాను ప్రభావం పెద్దగా ఉండదని భావించి సముద్రంలోనే ఉండిపోయారు. అయితే, అలల ధాటికి రామాపురం నుంచి ఉళ్లపాలెం వరకు కొట్టికొచ్చింది పడవ. సముద్రంలో చిక్కుకున్న మత్స్యాకారులను ఒడ్డుకు చేర్చేందుకు పోలీసులు, రెవెన్యూ, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

  • 10 Dec 2022 11:51 AM (IST)

    వ్యవసాయ బోరుబావి నుంచి ఉబికి వస్తున్న వర్షం నీరు..

    మాండూస్ తుపాను కారణంగా తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరి, పుత్తూరు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వర్షపు నీరు నీట మునిగింది. భారీ వర్షాలకు పుత్తూరు సమీపంలోని రామాపురంలో వ్యవసాయ బోరుబావి నుంచి నీరు బయటకు ఉబికి వస్తోంది.

  • 10 Dec 2022 11:31 AM (IST)

    మాండూస్ ఎఫెక్ట్.. బలంగా వీస్తున్న ఈదురుగాలులు..

  • 10 Dec 2022 11:20 AM (IST)

    చెన్నై విమానాశ్రయం నుంచి విమాన ప్రయాణాలు రద్దు..

    తమిళనాడులో మాండూస్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. చెన్నై సహా పది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కాశిమేడు దగ్గర అలల ఉధృతి భీకరంగా ఉంది. మత్స్యకారుల బోట్లు ధ్వంసం అయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు కుప్పకూలాయి. గోడలు కూలి వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటి వరకు తుపాను కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై విమానాశ్రయం నుంచి అన్ని విమానాలను రద్దు చేశారు. మరోవైపు అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.

  • 10 Dec 2022 10:46 AM (IST)

    మాండూస్‌ ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం

    మాండూస్ తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. దాంతో అలర్ట్ అయిన అధికారులు.. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను మూసివేశారు. క్రేన్స్, ఆటోక్లీనిక్‌ వాహనాలను సిద్ధం చేసింది టీటీడీ. ఇక భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని డ్యామ్‌లు అన్నీ నిండుకుండల్లా మారాయి.

  • 10 Dec 2022 10:28 AM (IST)

    భారీ వర్షాలు.. దెబ్బతిన్న పంట.. ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు..

    కాకినాడ జిల్లాలో మాండూస్‌ తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఐతే ఇప్పటికే ఆరిపోయిన ధాన్యానికి 15 శాతం మార్చురీ పాయింట్లు ఇస్తే గానీ..రైతు భరోసా కేంద్రాలు, రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకొని పరిస్థితి నెలకొందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 శాతం పాయింట్లు వచ్చేవరకు ధాన్యం ఆరబోయాలంటే కనీసం 10 రోజులు టైం పడుతుంది..ఈ సమయంలోనే తుఫాను ప్రభావంతో పడుతున్న వర్షానికి ధాన్యం తడిసిముద్దయింది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు రైతన్నలు..తమ పరిస్థితి చూసి తడి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.

  • 10 Dec 2022 10:13 AM (IST)

    మాండూస్ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో దంచికొడుతున్న వానలు..

    మాండూస్‌ తుపాన్ కారణంగా పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఇటు దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఐతే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని ప్రకటించింది వాతావరణ శాఖ. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని తెలిపింది. నిన్నటి నుంచి తిరుపతిలో వర్షం కురుస్తుండటంతో పలు విమానాలను రద్దు చేశారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

  • 10 Dec 2022 10:00 AM (IST)

    నేల కూలిన భారీ వృక్షాలు..

    చెన్నైలో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. చెట్లు, గోడలు కూలి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చెన్నై సిటీలోనే 400లకు పైగా భారీ వృక్షాలు కూలినట్టు తెలుస్తోంది. తుఫాన్‌ ప్రభావంతో చెన్నై విమానాశ్రయం నుంచి అన్ని విమానాలు రద్దు చేశారు. మహాబలిపురం వెళ్లే ఈసీఆర్‌ రోడ్డులో ఆంక్షలు విధించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు.

  • 10 Dec 2022 09:40 AM (IST)

    తుఫాన్‌ ప్రభావంతో తమిళనాడు, ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు..

    తుఫాన్‌ ప్రభావంతో ఇవాళ, రేపు తమిళనాడు, ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా తిరుపతి జిల్లాపై మాండూస్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వాకాడు మండలం తూపిలిపాలెం బీచ్ దగ్గర 10 మీటర్లు ముందుకొచ్చింది సముద్రం. చిట్టుమూరు మండలం తీర ప్రాంతంలోని పంబలి, మెట్టు, శ్రీనివాసపురం గ్రామాలకు రాక పొకలు బంద్ అయ్యాయి. చిట్టమూరు, చిల్లకూరు, వాకాడు, కోట మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. సముద్ర తీర ప్రాంతంలో శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. పంట పొలాలన్నీ నీట మునిగిపోయాయి.

  • 10 Dec 2022 09:20 AM (IST)

    ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం..

    దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం తెలిపింది నిన్నటి నుంచి తిరుపతిలో వర్షం కురుస్తుండటంతో పలు విమానాలను రద్దు చేశారు.

  • 10 Dec 2022 09:17 AM (IST)

    తుపానుపై సీఎం జగన్ సమీక్ష..

    మాండూస్ తుపాను ఎఫెక్ట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో తుపాను ప్రభావంపై సీఎం ఆరా తీశారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు సీఎం. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

  • 10 Dec 2022 08:58 AM (IST)

    బీభత్సం సృష్టిస్తున్న మాండూస్‌ తుపాన్..

    మాండూస్‌ తుపాన్ తమిళనాడుతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఈ తెల్లవారుజామున మహాబలిపురం దగ్గర తీరం దాటినా..తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పెనుగాలుల ధాటికి తీరంలో మత్స్యకారుల బోట్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు తుఫాన్‌ కారణంగా నలుగురు మృతి చెందారు.

  • 10 Dec 2022 07:26 AM (IST)

    తీరం దాటిన తుపాను..చెన్నై సహా పది జిల్లాల్లో భారీ వర్షాలు..

    మాండూస్‌ తుపాన్ మహాబలిపురం దగ్గర తీరం దాటింది. చెన్నై సహా పది జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.చెన్నైలోని చెట్లు నెలకూలాయి. విమానాశ్రయం నుంచి అన్ని విమానాలు రద్దు చేశారు. మహాబలిపురం వెళ్లే ఈసీఆర్‌ రోడ్డులో ఆంక్షలు విధించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురంతోపాటు పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, మరో 26 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. చెన్నైతో పాటు పలు జిల్లాల్లో పెనుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. చెన్నైతోపాటు 5 ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

  • 10 Dec 2022 07:13 AM (IST)

    తుపాను ఎఫెక్ట్‌తో మోస్తరు వర్షం..

    మాండూస్‌ తుపాను కారణంగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఒంగోలు, సింగరాయకొండ, జరుగుమల్లి, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎన్ డి ఆర్ ఎఫ్ , ఏపీ ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు తుపాను సహాయక చర్యలు చేపట్టానికి సిద్ధంగా ఉన్నారు.

  • 10 Dec 2022 06:45 AM (IST)

    తుపాను ప్రభావంతో ఎగసిపడుతోన్న అలలు..

    మాండస్ తుఫాన్ ప్రభావంతో నరసాపురం తీరం వెంబడి పెను గాలులు, చిరు జల్లులు కురుస్తున్నాయి. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో వేట పడవలు, బోట్లు తిరిగి తీరానికి చేరుకున్నాయి.

  • 09 Dec 2022 09:12 PM (IST)

    మాండూస్‌ ఎఫెక్ట్‌.. పునరావాస కేంద్రాలకు చిత్తూరు ప్రజలు

    మాండూస్ నుంచి ముందు జాగ్రత్తగా చిత్తూరులోని 4 మండలాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది జిల్లా యంత్రాంగం. 169 మందిని పునరావాస కేంద్రాలకు తరలించింది. నగిరి రూరల్ లో 59 మంది, నగరి అర్బన్ 50 మంది, పాలసముద్రంలో 50 మంది, విజయపురం 10 మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.వీరికి భోజనం తదితర సౌకర్యాలు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.

  • 09 Dec 2022 08:12 PM (IST)

    తమిళనాడులో స్తంభించిన ప్రజా రవాణా..

    మాండూస్ ప్రభావం కారణంగా తమిళనాడులో ని పలు ప్రాంతాల్లో అక్కడ  భారీ వర్షాలు కురుస్తున్నాయి.  దీంతో ప్రజా రవాణా స్తంభించింది. అలాగే 10 విమానాలు రద్దయ్యాయి.

  • 09 Dec 2022 08:11 PM (IST)

    తమిళనాడులో భారీ వర్షాలు

    మాండూస్ తుపాన్ ప్రభావంతో తమిళనాడులో  భారీ వర్షాలు కురుస్తున్నాయి.  మాండూస్ ఈ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న కొద్ది గంటల్లో ఉత్తర తమిళనాడు, రాయలసీమ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • 09 Dec 2022 05:46 PM (IST)

    సీమలో భారీ వర్షాలకు ఛాన్స్‌

    కాగా తీరం దాటే సమయంలో 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రానున్న రెండురోజులు దక్షిణకోస్తాలోని ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల సంస్థ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • 09 Dec 2022 05:45 PM (IST)

    బలహీనపడిన మాండూస్‌..

    ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనడిందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుపాను ప్రస్తుతానికి శ్రీలంకలోని జఫ్నాకు తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో, మహాబలిపురానికి 180 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో వాయువ్య దిశగా గంటకు 10కిలోమీటర్ల వేగంతో కదులుతోందని, శుక్రవారం అర్ధరాత్రి నుండి శనివారం తెల్లవారుజాములోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది.

  • 09 Dec 2022 04:25 PM (IST)

    సముద్రం అల్లకల్లోలం.. ఎగసిపడుతున్న అలలు..

    మాండోస్ తుఫాను ప్రభావంపై భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఇక దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చు. రేపు కూడా తమిళనాడు, రాయలసీయ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అలలు ఎగసిపడతాయి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. పంటలు, తోటలు, ఇళ్లు దెబ్బతినే అవకాశముందని హెచ్చరించింది.

  • 09 Dec 2022 02:30 PM (IST)

    గోదావరి జిల్లాల్లో పూర్తిగా మారిపోయిన వాతావరణం..

    మాండూస్ తుఫాన్ ప్రభావంతో గోదావరి జిల్లాల్లోనూ వాతావరణం పూర్తిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ధాన్యం కల్లాల్లోనే ఉండటంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఉప్పాడ దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి.

  • 09 Dec 2022 01:51 PM (IST)

    నిజాంపట్నం హార్బర్ లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక..

    తుఫాన్ నేపధ్యంలో బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పలు ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కోతల సమయం కావడంతో హడావుడిగా కుప్పలు వేసుకుంటున్నారు. మరోవైపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. దీంతో నిజాంపట్నం హార్బర్‌లోనే నిలిచిపోయాయి బోట్లు.

  • 09 Dec 2022 12:43 PM (IST)

    తిరుపతిలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..

    మాండూస్ ఎఫెక్ట్ తిరుమలపై పడింది. తిరుమల, తిరుపతిల్లో ఉదయం నుంచి నాన్‌స్టాప్‌‌గా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్ వెంకట రమణారెడ్డి. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

  • 09 Dec 2022 12:33 PM (IST)

    తిరుమలకు మాండోస్ తుఫాన్ ఎఫెక్ట్.. దంచికొడుతున్న వాన..

    ఏపీకి మాండూస్ ముప్పు ముంచుకొస్తోంది. వేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం చెన్నైకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న మాండూస్‌..12 కిలోమీటర్ల వేగంతో పయస్తోంది. ఇవాళ రాత్రికి తమిళనాడు-మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశముంది. కాగా, మాండోస్ తుఫాన్ ఎఫెక్ట్ తిరుమలను తాకింది. ఉదయం నుంచి నిరంతరాయంగా వర్షం కురుస్తోంది. ఘాట్రోడ్లలో కొండచరియలు విరిగిపడేలా పరిస్థితి నెలకొంది. అలర్ట్ అయిన టీటీడీ అధికారులు.. క్రేన్లు, ఆటో క్లీనిక్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. ఆకాశగంగ, పాపవినాశనంలో సిబ్బంది అప్రమత్తం అయ్యారు.

  • 09 Dec 2022 09:23 AM (IST)

    దూసుకొస్తున్న మాండూస్.. 6 జిల్లాల్లోని కోటిమందికి మెసేజ్‌లు..

    మాండూస్ తుపాను తీరం వైపు దూసుకొస్తోంది. ఇవాళ అర్థరాత్రి దాటిన తరువాత మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు తుపాను కదలికలపై పర్యవేక్షణ జరుగుతోంది. దీని ప్రకారం జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నారు అధికారులు. తుపాను ప్రభావం చూపే జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. సహాయ చర్యల కోసం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సహాయక బృందాలు చేరుకున్నాయి. కామన్ అలర్ట్ ప్రోటోకాల్, ఏపీ అలర్ట్ ద్వారా 6 జిల్లాల్లోని సుమారు కోటిమందికి తుపాను హెచ్చరికల సందేశాలను పంపించారు.

  • 09 Dec 2022 09:17 AM (IST)

    Cyclonic Mandous: ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్..

    నైరుతి బంగాళాఖాతం మీదుగా మాండూస్ తూపాను దూసుకొస్తోంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంగా పశ్చిమ్ర-వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇవాళ అర్థరాత్రి తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం మాండూస్ తుపాను.. శ్రీలంకలోని ట్రింకోమలీకి 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. జాఫ్నాకు 230 కిలోమీటర్లు, కారైకాల్‌కు తూర్పున 200 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో 3 గంటల్లో తుపాను బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

  • 08 Dec 2022 06:05 PM (IST)

    నిజాంపట్నం పోర్టులో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక

    మండూస్ తుఫాను ప్రభావం  కారణంగా బాపట్ల జిల్లా  నిజాంపట్నం హార్బర్ లో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు..

  • 08 Dec 2022 05:56 PM (IST)

    ఒంగోలుకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు..

    మాండూస్ తుఫాను కారణంగా సహాయర చర్యలు చేపట్టేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎపీడీఆర్‌ఎఫ్‌ బృందాలు ఒంగోలుకు చేరుకున్నాయి.. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశంజిల్లాకు కూడా మాండూస్‌ తుఫాను ప్రభావం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.. జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.. ఏపీతో పాటుగా తమిళనాడులోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. తుఫాను రక్షణ, సహాయర చర్యల కోసం పది ఎన్డీఆర్ఎఫ్, ఎపిడిఆర్‌ఎఫ్‌ బృందాలు ఒంగోలులో సిద్దంగా ఉన్నాయి.. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉండటంతో ప్రకాశంజిల్లా యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా.. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎపిఆర్‌డిఎఫ్‌ బృందాలను నియమించారు. శనివారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తుగా లోతట్లు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారుకు ఆదేశాలు అందాయి. తుఫాను తీరం దాటే సమయంలో ఆరు జిల్లాల్లో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం అర్థరాత్రి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని పర్భావంతో మూడు రోజులపాటు.. దక్షిణ కోస్తాంధ్రాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో తమ సిబ్బందితో సహాయక చర్యల కోసం రెడీగా ఉన్నామని ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎపీడీఆర్‌ఎఫ్‌ దళాల అధికారులు తెలిపారు..

  • 08 Dec 2022 04:18 PM (IST)

    మాండూస్ తుపాన్ ఎఫెక్ట్..

    మాండూస్ తుపాన్ కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. చెన్నై నుండి సింగపూర్, ముంబై వెళ్ళాల్సిన 11 విమానాల దారి మళ్లించారు. అలాగే తూత్తూకుడి, షిరిడీకి వెళ్లే నాలుగు విమానాలు రద్దు చేశారు.

  • 08 Dec 2022 03:37 PM (IST)

    తుపాన్ పై సీఎం జగన్ సమీక్ష..

    తుపాను పరిస్థితులపై  సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం జగన్. మాండూస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పునరావాస కేంద్ర తరలింపుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. అలాగే రైతుల్లో కూడా ఈ తుపాను పట్ల అవగాహన కల్పించాలని, రైతు సహాయకారిగా ఉండాలని జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా నిరోధించాలని కోరారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని, అప్పుడే ప్రాణ, ఆస్తి నష్టం కలగకండా కాపాడుకోవచ్చని సీఎం వివరించారు.

  • 08 Dec 2022 02:41 PM (IST)

    రాయలసీమకు అలెర్ట్..

    ఇక రాయలసీమలో ఈ రోజు తేలిక పాటి  నుండి  ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. తిరుపతి జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు చిత్తూరు ,అన్నమయ్య జిల్లాలలో భారీ నుంచి అతి భారీ  వర్షాలు  ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 65 -75  కి మీ గరిష్టం గా  85 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి  తేలిక పాటి  నుండి చాలా చోట్ల  ఒక మోస్తరు వర్షాలు   కురిసే అవకాశముంది. సత్యసాయి, అనంతపురం చిత్తూరు ,అన్నమయ్య జిల్లాలలో భారీ నుంచి అతి భారీ  వర్షాలు కురిసే అవకాశం ఉంది. వైస్సార్ కడప జిల్లాలో భారీ  వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 55 -65  కి మీ గరిష్టం గా  75 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

  • 08 Dec 2022 02:38 PM (IST)

    నెల్లూరుకు భారీ వర్ష సూచన

    మాండూస్‌ తుపాను ప్రభావంతో ఈ రోజు ఉత్తరకోస్తాలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే రేపు ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఇక దక్షిణ కోస్తాలో ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. నెల్లూరు జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  • 08 Dec 2022 02:25 PM (IST)

    నైరుతి బంగాళాఖాతం మీదుగా మాండూస్‌..

    మాండూస్‌ తుపాన్‌ నైరుతి బంగాళాఖాతం మీదుగా ట్రింకోమలీ (శ్రీలంక) కి తూర్పు ఈశాన్యంగా 300 కి.మీ. జాఫ్నా (శ్రీలంక)కి తూర్పు ఆగ్నేయంగా 420 కి.మీ., కారైకాల్కు తూర్పు ఆగ్నేయంగా 460 కి.మీ. చెన్నైకి ఆగ్నేయంగా 550 కి.మీ వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి మధ్య 9 డిసెంబర్ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో పుదుచ్చేరి శ్రీహరికోట దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను ఆనుకుని 65 నుండి 75 కిలోమీటర్లు గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

  • 08 Dec 2022 01:34 PM (IST)

    సముద్ర తీరం ఉదృతం..

    • తుఫాన్ ఎఫెక్ట్ తో తమిళనాడు లో ఒక్కసారిగా మారిన వాతావరణం.

    • సముద్ర తీరం ఉదృతం..

    • తీరం వెంబడి పెరిగిన గాలుల వేగం..

    • తిరువళ్లూరు, తంజావూరు, చెంగల్పట్టు, జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు.

    • పలు జిల్లాల్లో భారీ వర్షాలు..

  • 08 Dec 2022 12:20 PM (IST)

    సీఎంఓ అధికారులతో తుపాను పరిస్థితులపై సీఎం సమీక్ష...

    • అప్రమత్తంగా ఉండాలని వివిధ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు.

    • తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని సూచన.

    • తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం.

    • నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో వర్ష సూచన.రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కలిగించాలని సూచన.

  • 08 Dec 2022 11:17 AM (IST)

    గంటకు 12 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ‘మాండూస్’..

    నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా తమిళనాడు వైపు దూసుకు వస్తోంది. కారైకాల్‌కు తూర్పు ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, చెన్నై 620 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది.

  • 08 Dec 2022 10:40 AM (IST)

    మరో మూడు గంటల్లో మోస్తరు వర్షాలు..

    బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారింది. ఇది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకువస్తోంది. తుపాను ప్రభావంతో రానున్న 3 గంటల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

  • 08 Dec 2022 09:34 AM (IST)

    తమిళనాడు తీరం అలర్ట్‌..

    సైక్లోన్‌ మాండస్‌ దూసుకువస్తోంది. తమిళనాడు తీరం అలర్ట్‌ అయింది. సముద్రతీరంలో వాతావరణం మారిపోయింది. వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఇప్పటికే ఆరు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది స్టాలిన్‌ సర్కారు. NDRF బలగాలను కూడా అక్కడకు రప్పించారు.

  • 08 Dec 2022 08:23 AM (IST)

    మరింత బలంగా దూసుకొస్తున్న మాండూస్.. ప్రస్తుతం తమిళనాడుకు సమీపంలో..

    బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను తన పరిధిని పెంచుకుంటూ బలంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడుకి దగ్గర్లో ఉన్న ఈ తుఫాను.. శనివారం ఉదయం శ్రీహరికోట - పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం. తుపాను కదలికలకు సంబంధించిన చిత్రాలను భారత వాతావరణ శాఖ అధికారులు విడుదల చేశారు.

Published On - Dec 08,2022 8:18 AM

Follow us