
సెల్ ఫోన్లు కొనడమేమో గాని వాటిని కాపాడుకోవడమే పెద్ద బాధ అయిపోయింది. మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయిన సెల్ ఫోన్ లేకపోతే మనిషి ఉండలేకపోతున్నాడు. కొత్త కొత్త మొబైల్స్ ను కొనడం వాటిని పోగొట్టుకోవడం ఆ తర్వాత తల పట్టుకోవడం ఇది సర్వసాధారణమైంది. అందుకే పోలీసులు సెల్ ఫోన్ రికవరీ మేళాలు చేస్తున్నారు. పోలీసులకు వస్తున్న ఫిర్యాదులలో ఎక్కువ భాగం సెల్ ఫోన్లు పోగొట్టుకోవడమే అవడంతో టెక్నాలజీని ఉపయోగించి వాటిని తీసుకువచ్చి పోగొట్టుకున్న వారికి అందిస్తున్నారు. అందులో భాగంగానే కడప జిల్లాలో కూడా ఇప్పటికి ఏడు విడతలుగా సెల్ ఫోన్ల రికవరీని చేసి బాధితులకు అప్పచెప్పారు.
ఆపరేషన్ మొబైల్ షీల్డ్ లో భాగంగా కడప జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్, నిఘా, డేటా విశ్లేషణ పద్ధతులను ఉపయోగించి కోటి 86 లక్షల రూపాయల విలువ గలిగిన 72 రికవరీ మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఇప్పటివరకు కడప జిల్లాలో మొత్తం ఏడు విడతలలో మొబైల్ రికవరీ మేళాను నిర్వహించారు. అందులో భాగంగా 5372 ఫోన్ లను అంటే 11 కోట్ల ఆరు లక్షల రూపాయల విలువ గలిగిన మొబైల్ ఫోన్ లను ఒక్క కడప జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న బాధితులకు అందజేశారు. ఆపరేషన్ మొబైల్ షీల్డ్ లో భాగంగా విజయవంతమైన ఈ ఆపరేషన్కు బాధితులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిపిఎస్ ట్రాకింగ్, సైబర్ నిఘా టూల్స్ వాడి మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి బాధితులకు అప్పచెప్పుతున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం ద్వారా వాట్సాప్ నెంబర్ 9392941541 ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసులు వాడిన సాంకేతిక విభాగంలో ట్రాకింగ్ అలాగే డేటా అనలిటిక్స్ పద్ధతి ద్వారా ఎక్కువ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. రికవరీ విషయంలో రాష్ట్రస్థాయిలో కడప జిల్లా మంచి ప్రగతి సాధించిందని ఆయన అన్నారు.
సైబర్ క్రైమ్ మోసాలకు గురి అయిన వెంటనే Dail 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. NCRP ( https://cybercrime.gov.in) వెబ్సైట్ లో ఫిర్యాధు చేయాలని జిల్లా ఎస్పి తెలిపారు .
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.