Eluru disease: ఏలూరు ఘటనపై కేంద్ర వైద్య, సాంకేతిక సంస్థల నిపుణులతో సీఎం జగన్ సమీక్ష.. కారణాలపై ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు..
ఏలూరులో ప్రజలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురవడంపై కేంద్ర వైద్య, సాంకేతిక సంస్థల నిపుణులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు.
ఏలూరులో ప్రజలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురవడంపై కేంద్ర వైద్య, సాంకేతిక సంస్థల నిపుణులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఘటనకు గల కారణాలేంటి అనే దానిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే, తాగునీరు కలుషితమైందనడానికి ఆధారాలు లభించలేదని ఢిల్లీ ఎయిమ్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలీ, ఏపీ మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరోవైపు పురుగుల మందుల అవశేషాలే ఈ పరిస్థితికి కారణమని ఎన్ఐఎన్ ప్రాథమిక అంచనా వేసింది. మరింత విశ్లేషణ, దీర్ఘకాలిక పరిశోధన అవసరమని ఎన్ఐఎన్ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రక్త నమూనాల పరీక్షల్లో లెడ్, నికెల్ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆర్గోనోక్లోరిన్స్, ఆర్గనో ఫాస్పేట్స్ ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఇవి ఎలా శరీరాల్లోకి చేరాయన్న దానిపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
కాగా, నిపుణులు తెలిపిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్.. ఏ అంశాన్నీ కొట్టిపారేయొద్దన్నారు. నిపుణులు వ్యక్తం చేసిన ప్రతి కోణంలోనూ మరింత లోతుగా పరిశీలన, పరిశోధన జరగాలని అధికారులను ఆయన ఆదేశించారు. పురుగులమందుల వాడకాన్ని తగ్గించేలా, ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహించేలా ముందుకు సాగాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఆర్బీకేలో రైతులకు సేంద్రీయ, సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించాలన్నారు. దీనికోసం అవసరమైన పరికరాలు, ఉపకరణాలను ఆర్బీకేల పరిధిలోనే ఉంచాలని అధికారులను సీఎం ఆదేశించారు.