
పెన్షన్లు తీసేస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో ఏ ఒక్కరి పెన్షన్ను తీసేయడం లేదని స్పష్టం చేశారు. కేవలం రీవెరిఫికేషన్ మాత్రమే జరుగుతోందని, అర్హుల్లో ఎవరికీ అన్యాయం జరగబోదని తేల్చి చెప్పారు. పెన్షన్లపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ జరగాలి.. ఇందులో భాగంగా ఆడిట్ జరుగుతుంటే పెన్షన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్ మాత్రమే చేస్తారు.. అర్హులందరికీ పెన్షన్లు అందాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అని వివరణ ఇచ్చారు. మంచి పనులను చెడుగా చూపించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ విషపు రాతను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. తప్పుడు ప్రచారాన్ని కలెక్టర్లు తిప్పికొట్టాలని సూచించారు సీఎం జగన్.
గత ప్రభుత్వంలో పెన్షన్ బిల్లు కేవలం రూ.400 కోట్లు మాత్రమే. ఇప్పుడు నెలనెలా పెన్షన్ బిల్లు రూ.1770 కోట్లు చేరిందన్నారు. గత ప్రభుత్వంలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారని.. అదే మన ప్రభుత్వంలో 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ రూ.వెయ్యి మాత్రమే ఇచ్చేవారని.. తాము మాత్రం పెన్షన్ రూ.2750కి పెంచుతూ ఉన్నామని వివరించారు.
తమది రైతులు, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వమని.. ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకూడదన్నదే తమ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మందికి పెన్షన్లు అందుతున్నాయన్నారు. మొత్తం రూ.590.91 కోట్లను సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం