
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై కేంద్రమంత్రితో ఆయన చర్చలు జరిపారు. పోలవరం నిర్మాణ పురోగతితో పాటు రాష్ట్రానికి చెందిన ఇతర ప్రాజెక్టుల గురించి కేంద్రమంత్రి సీఎం చంద్రబాబు వివరించారు, అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి నిధులు అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని.. ఈ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టు అమలులో అవరోధాలు ఏర్పడుతున్నాయన్నారు.
పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్మెంట్ చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్–IIకి ఆర్థిక సహాయం అందించాలని.. ఫేజ్–IIలో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉందని సీఎం తెలిపారు. వీటికి అదనంగా సుమారు రూ.32,000 కోట్ల నిధులు అవసరమని.. గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేశామన్నారు. ఇది తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాలు తీర్చే కీలక ప్రాజెక్టు అని ఆయన కేంద్రమంత్రికి వివరించారు.
జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి, సాంకేతిక, ఆర్థిక సాయం ఇవ్వాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలని.. వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ (వీడబ్ల్యుడీటీ) తుది నివేదిక గెజెట్లో ప్రచురించాలన్నారు. ట్రిబ్యునల్ నివేదికను వెంటనే గెజెట్లో ప్రచురించి, వంశధారపై నిర్మించ తలపెట్టిన నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని కోరారు.
అలాగే గోదావరి జలాల పంపకంపై ఏపీ-తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోందని.. నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అభ్యంతరం తెలియజేశారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్కు వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.