CJI NV Ramana: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ పర్యటన కొనసాగుతోంది. మూడు రోజుల పాటు ఏపీ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన.. ఏపీ హైకోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు న్యాయవ్యవస్థపై నిర్లక్ష్యంతో ఉన్నాయని అన్నారు. న్యాయ వ్యవస్థను చిన్న చూపు చూస్తున్నారని, దేశంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రభుత్వ ఆధీనంలో ఉందని అన్నారు. ముద్దాయికి శిక్ష పడాలని మాత్రమే ఆలోచించేలా పబ్లిక్ ప్రాసిక్యూషన్ వ్యవస్థ ఉందని, పబ్లిక్ ప్రాసిక్యూషన్ వ్యవస్థ ప్రక్షాళన జరగాలని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పబ్లిక్ ప్రాసిక్యూషన్ వ్యవస్థ రావాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, బెజవాడలో కోర్టు నిర్మాణం పూర్తి చేసుకోలేని స్థితిలో ఉన్నామన్నారు. ప్రభుత్వాలు మారినా బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాలేదన్నారు. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు బార్ అసోసియేషన్లు సహకరించాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
కాగా, ఈ పర్యటనలో భాగంగా అమరావతిలో న్యాయమూర్తికి అపూర్వ స్వాగతం లభించింది. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన తొలి సారిగా అమరావతికి వచ్చారు. సీజేఐ ఎన్వీ రమణ నాగార్జున యూనవర్సిటీలో జరిగిన ఏపీ న్యాయాధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆయన అమరావతి బయల్దేరారు. నేలపాడులోని హైకోర్టులో బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సీజేఐ కు సన్మానం జరిగింది. అంతకు ముందు.. నాగార్జున యూనివర్సిటీ నుంచి హైకోర్టుకు వెళ్లే దారిలో సీజేఐ ఎన్వీ రమణకు అమరావతి రైతులు అపూర్వ స్వాగతం పలికారు. జాతీయ జెండాలతో ఆయనపై పూల వర్షం కురిపిస్తూ.. ఆహ్వానం పలికారు. వారి ఆహ్వానానికి.. అభిమానానికి ప్రతిగా సీజేణ తన కారులోనే నిలబడి వారికి నమస్కారం చేస్తూ ముందుకు సాగారు.
ఇవి కూడా చదవండి: