
అమరావతి, నవంబర్ 01: తెలుగు దేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం సాయంత్రం రోడ్డుమార్గాన బయలుదేరారు. దారి మధ్యలో కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు.
చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్న మహిళలు హారతులు పట్టి తమ అభిమాన నేతను చూసి భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు రాజమండ్రిలో బయలుదేరిన చంద్రబాబు బుధవారం ఉదయం 5 గంటలు దాటాక ఉండవల్లికి చేరుకున్నారు. సుమారు 13 గంటలపాటు చంద్రబాబు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఉండవల్లిలో టీడీపీ నేతలు, రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. నివాసానికి చేరుకోగానే చంద్రబాబుకు సతీమణి నారా భువనేశ్వరి హారతిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆమె దిష్టి తీశారు. మహిళలు గుమ్మడికాయలు కొట్టి చంద్రబాబుకు హారతులు పట్టారు.
చంద్రబాబును వైద్య పరీక్షలకు వెంటనే హైదరాబాద్ తీసుకురావాలని కుటుంబసభ్యులకు వైద్యుల సూచన చేశారు. దీంతో తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు చంద్రబాబు. కోర్టు ఆదేశాలతో ఆరోగ్య పరీక్షలకు చంద్రబాబు హైదరాబాద్ వెళుతున్నారని అచ్చెన్నాయుడు ప్రకటించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు వెంటనే చేయించాలని వైద్యుల సూచనలు చేశారు. బుధవారం నాడు చంద్రబాబు ఎవరినీ కలవరని అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. కోర్టు ఆదేశాలతో చంద్రాబాబు ఆరోగ్య పరీక్షల కోసం వెంటనే హైదారబాద్ బయలుదేరాలని నిర్ణయం తీసుకున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంతో A13గా పేర్కొంటూ నంద్యాలలో సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్టు చేసింది సీఐడీ. ఏపీ రాజకీయాల్లో అదొక పెను సంచలనం. చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసింది ఏపీ సీఐడీ. మద్యం కంపెనీలకు అనుచిత లబ్ది చేకూర్చినట్టు బేవరేజెస్ కార్పొరేషన్ ఎమ్డీ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఇదే రోజు మధ్యంతర బెయిల్ పిటిషన్లో తీర్పును రిజర్వు చేసింది ఏపీ హైకోర్టు. మరుసటి రోజు.. అంటే ఇవాళ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.
బెయిల్ రాకపోవడంతో చంద్రబాబు రిమాండ్ను మూడుసార్లు పొడిగించింది ఏసీబీ కోర్టు. ఈ 52 రోజుల్లోనే చంద్రబాబు ములాఖత్ల మీద కూడా న్యాయపోరాటం జరిగింది. నిజం గెలుస్తుంది… రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ మీ మధ్యకొస్తా అంటూ దసరా సందేశమిస్తూ ఓపెన్ లెటర్ రాసుకున్నారు. రాజమండ్రి జైల్లో భద్రతా లోపాలున్నట్టు, తనకు ప్రాణహాని ఉన్నట్టు ఈనెల 25న మరోసారి మూడు పేజీల లేఖ రాశారు. ఎట్టకేలకు మధ్యంతర బెయిల్తోనైనా చంద్రబాబు విడుదల కావడం టీడీపీ క్యాడర్కు, నారా ఫ్యామిలీకి ఒక తాత్కాలిక ఊరట లభించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి