
ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం తిరోగమనం పాలయ్యిందన్నారు చంద్రబాబు, పవన్. అమరావతి రాజధానిని విధ్వంసం చేశారని, ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా కావాలని అనడం సిగ్గుచేటన్నారు. విపక్షాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లి.. జగన్ గద్దె దించుతామన్నారు బాబు, పవన్. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. రివర్స్ పాలనలో ఆంధ్రప్రదేశ్ నాశనమైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతి దేవతల రాజధాని అని.. అందరి ఆమోదంతోనే అమరావతి పెట్టామన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు బాధపడుతున్నారని.. ఈ పదేళ్లలో రాజధాని పూర్తయి ఉంటే.. 2లక్షల కోట్ల ఆదాయం వచ్చేదన్నారు బాబు. సీఎం జగన్ ఏపీ నుంచి పరిశ్రమలను తరిమేశారని ఆరోపించారు చంద్రబాబు. ఐదేళ్లలో మూడు రాజధానులన్న వైసీపీ.. ఇప్పుడు నాలుగో రాజధాని హైదరాబాద్ అని మాట్లాడుతోందన్నారు. శాండ్, మైన్, మద్యం అన్నింటా దోచుకుంటున్నారని, విపక్షాలు మీటింగ్స్ కూడా పెట్టుకోకుండా వేధిస్తున్నారన్నారు చంద్రబాబు.
కూల్చివేతలతో మొదలైన వైసీపీ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్య విలువలను తాకట్టుపెట్టారని.. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పారు. ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి కోరారు. అమరావతి రైతులపై దాడి బాధ కలిగించిందన్నారు పవన్. ఇసుక రీచ్ లను సర్పంచ్లు, ఎంపీటీసీలను కాదని ఓ కాంట్రాక్టర్ కు జగన్ కట్టబెట్టారని విమర్శించారు పవన్. మైనింగ్ను కొందరి కనుసన్నల్లో నడుపుతున్నారని చెప్పారు. క్లాస్ వార్ పై జగన్కు భవిష్యత్లో గుణపాఠం తప్పదన్నారు పవన్. ఎన్నికల తర్వాత వచ్చేది.. టీడీపీ-జనసేన ప్రభుత్వం అన్నారు బాబు, పవన్. జగన్ను ఇంటికి పంపేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..