
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం నడిబొడ్డున కొలువై ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దివ్యక్షేత్రం త్వరలోనే ఒక అరుదైన ఘట్టానికి వేదిక కాబోతోంది. భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న మావుళ్లమ్మ తల్లిని సంపూర్ణ స్వర్ణమయం చేయడానికి ఆలయ కమిటీ, ప్రజాప్రతినిధులు మరియు భక్తులు మహత్తరమైన సంకల్పాన్ని చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు 100 కిలోల బంగారు ఆభరణాలతో దేశంలోనే అత్యధిక స్వర్ణంతో దర్శనమిచ్చే ఏకైక గ్రామదేవతగా చరిత్ర సృష్టించనున్నారు.
అమ్మవారికి 100 కిలోల బంగారు ఆభరణాలు, విశేషమైన స్వర్ణ చీరను సమర్పించడానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే దేశంలోనే నిత్యం 100 కిలోలకు పైగా స్వర్ణాభరణాలతో దర్శనమిచ్చే ఏకైక గ్రామదేవతగా శ్రీ మావుళ్లమ్మ తల్లి రికార్డు సృష్టించనున్నారు.
ప్రస్తుతం అమ్మవారి విగ్రహంపై 51 నుంచి 52 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి. భక్తుల నుంచి సేకరించిన సుమారు రూ.35 కోట్ల విలువైన 23.43 కిలోల బంగారాన్ని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వర్ణమయం కమిటీకి అధికారికంగా అందజేశారు. స్వర్ణ చీర తయారీకి కావలసిన మిగిలిన 27 కిలోల బంగారాన్ని సేకరించేందుకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక విరాళాల కౌంటర్ను ప్రారంభించారు.
వంద కేజీల బంగారం నిక్షిప్తం కానున్న నేపథ్యంలో ఆలయ భద్రతను అత్యున్నత స్థాయికి పెంచుతున్నారు. భక్తుల రద్దీ, ఆభరణాల విలువను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రతిపాదించారు. ఆలయ రక్షణకు గన్ మెన్లను కేటాయించాలని డీజీపీని కోరారు. ప్రస్తుతం ఉన్న 40కి పైగా సీసీ కెమెరాలు, హోంగార్డులతో పాటు త్వరలోనే ఆధునిక మెటల్ డిటెక్టర్లు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్లను అందుబాటులోకి తేనున్నారు.
కేవలం ఆభరణాలే కాకుండా ఆలయంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆషాఢ పౌర్ణమి, గురుపూర్ణిమ పర్వదినాల్లో అమ్మవారిని 6 టన్నుల రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో శాకాంబరీ దేవిగా నయనానందకరంగా అలంకరించారు. ప్రకృతి సమృద్ధిగా ఉండాలని, పంటలు బాగా పండాలని ఈ పూజలు నిర్వహిస్తారు. అలాగే గ్రామదేవతను తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు సమర్పించే ఆషాఢ సారె సంప్రదాయం ఇక్కడి భక్తిభావానికి ప్రతీకగా నిలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..