Andhra: ఎండ, వాన.. ఇప్పుడు వడగాలులు.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం.. తాజా వెదర్ రిపోర్ట్
రాష్ట్రంలో క్రమంగా ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. శుక్రవారం 42°C ఉష్ణోగ్రత రికార్డైందని పేర్కోన్నారు. శనివారం (10-05-25) 42°C- 43.5°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఆ వివరాలు ఇలా..

రాష్ట్రంలో క్రమంగా ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. శుక్రవారం 42°C ఉష్ణోగ్రత రికార్డైందని పేర్కోన్నారు. శనివారం (10-05-25) 42°C- 43.5°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మన్యం జిల్లా పాలకొండ, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలాల్లో తీవ్రవడగాలులు(3), 23 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆదివారం 7 మండలాల్లో తీవ్ర, 46 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. రేపు విజయనగరం-8, పార్వతీపురంమన్యం-9, అల్లూరి సీతారామరాజు-3, కాకినాడ-2, తూర్పుగోదావరి-1 మండలాల్లో (23) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 42°C, తిరుపతి జిల్లా గంగుడుపల్లెలో 41.3°C, నంద్యాల జిల్లా దొర్నిపాడు 40.9°C, శ్రీకాకుళం జిల్లా కొల్లివలసలో 40.7°C, చిత్తూరు జిల్లా పిపల్లి, నెల్లూరు జిల్లా దగదర్తిలో 40.6°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఎండలో బయటకు వెళ్లేప్పుడు నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రూమాలు కట్టుకోండి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. మరోవైపు రేపు అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పిడుగులు, ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు.
ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో 63.7మిమీ, చొప్పెలలో 55మిమీ, ఆలమూరు 47.5మిమీ, తూర్పుగోదావరి జిల్లా మురమండలో 40.5మిమీ, ఉండ్రాజవరంలో 31.2మిమీ, పశ్చిమగోదావరి జిల్లా దువ్వలో 30మిమీ వర్షపాతం నమోదైందన్నారు.