
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి పండుగ కానుకగా సుమారు రూ.2,653 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డీఏ, డీఆర్ ఎరియర్స్తో పాటు వివిధ అభివృద్ధి పనుల బిల్లులను క్లియర్ చేయడంతో లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏ, డీఆర్ ఎరియర్స్ కోసం రూ.1,100 కోట్లు కేటాయించింది. విధి నిర్వహణలో అలసిపోకుండా పనిచేసే పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవుల చెల్లింపుల కోసం రూ.110 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈఏపీ, నాబార్డ్, సాస్కీ, సీఆర్ఐఎఫ్ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.1,243 కోట్లు క్లియర్ చేసింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు నేరుగా ప్రయోజనం కలుగనుంది. పండుగకు ముందే ఈ నిధులు విడుదల కావడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
సాధారణంగా సంక్రాంతి వంటి పెద్ద పండుగల సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయడం ద్వారా ఉద్యోగుల కుటుంబాల్లో పండుగ ఉత్సాహం రెట్టింపు కానుంది. మరోవైపు, బిల్లులు అందక నిలిచిపోయిన అభివృద్ధి పనులు కూడా ఈ నిధులతో మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.