Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.6 వేలు.. ఆరోజే అకౌంట్లోకి..!
అన్నదాత సుఖీభవ నిధుల జమపై ఏపీ ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. దసరా పండుగ సందర్భంగా వీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఒకేసారి రైతుల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున జమ కానున్నాయి.

ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపై క్లారిటీ వచ్చింది. ఈ పథకం కింద ఏపీ ప్రభుత్వం ప్రతీ ఏడాది రూ.20 వేల ఆర్ధిక సాయం రైతులకు అందిస్తోంది. వీటిని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత నిధులను జూన్లో సీఎం చంద్రబాబు విడుదల చేశారు. లబ్దిదారుల అకౌంట్లో రూ.5 వేల చొప్పున జమ చేశారు. మొత్తం 46,85,838 రైతులకు రూ.3,125.47 కోట్లు జమ చేశారు. తొలి విడత నగదు విడుదల చేసి రెండు నెలలు పూర్తి కావడం, ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కావడంతో పంట సాగు మొదలుకావడంతో రెండో విడత సాయం కోసం రాష్ట్రంలోని రైతులు ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా వర్షాభావ పరిస్థితులు, ఎల్నివో ప్రభావం, పండుగల సీజన్ కూడా మొదలుకావడంతో పెట్టుబడి సాయం కోసం చూస్తున్నారు.
అన్నదాత సుఖీభవ రెండో విడత సాయం ఎప్పుడు..?
ఈ ఏడాదికి సంబంధించి రెండో విడత సాయం జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్లోనే జమ చేయాలని భావించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల అక్టోబర్కు వాయిదా వేశారు. అక్టోబర్లో దసరా పండుగ ఉండటంతో.. అప్పుడు విడుదల చేస్తే మంచిదనే భావనకు ప్రభుత్వం వచ్చింది. దసరా కానుకగా రైతులకు అన్నదాత సుఖీభవ పథకం నిధులను జమ చేయాలని ప్రభుత్వ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండో విడత కింద రూ.4 వేలు రైతుల అకౌంట్లలో ప్రభుత్వం జమ చేయనుంది. పీఎం కిసాన్తో కలిసి ఈ పథకాన్ని కూటమి సర్కార్ అమలు చేస్తోంది. పీఎం కిసాన్ సాయం రూ.2 వేలు అక్టోబర్లోనే జమ కానుండగా.. అదే రోజు ఏపీ ప్రభుత్వం రూ.4 వేలు జమ చేయనుంది. దీంతో ఏపీలోని రైతుల ఖాతాల్లో ఒకేసారి రూ.6 వేలు జమ కానున్నాయి.
పీఎం కిసాన్ 24వ విడతపై అప్డేట్..
అన్నదాత సుఖీభవ కింద ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ.14 వేలు ఇస్తుండగా.. పీఎం కిసాన్ కింద రూ.6 వేలు అందనున్నాయి. దీంతో ఏడాదికి రూ.20 వేలు ఏపీ రైతులు అందుకుంటున్నారు. పీఎం కిసాన్ 23వ విడత నిధులను జూన్ 20వ తేదీన ప్రధాని మోదీ విడుదల చేశారు. దీంతో 24వ విడత నిధులు అక్టోబర్లో జమ చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. పీఎం కిసాన్ నిధులు విడుదల చేసే రోజే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తోంది. దీంతో ఒకేరోజు రైతుల బ్యాంక్ ఖాతాల్లో రెండు పథకాల సొమ్ము జమ అవుతోంది.




