ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనొచ్చు
భూమిపై ఉన్న ప్రతీ ఒక్కరికీ ఓ మంచి లాప్టాప్ కొనేంత నల్లధనం కేవలం ఒక్క ఏడాదిలోనే అక్రమంగా పోగవుతోందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అంత పెద్ద మొత్తంలో నల్లధనం చలామణి అవుతున్నా, అందులో కనీసం ఒక శాతం కూడా వెనక్కి రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆర్థిక నేరాలపై జరిగిన 43వ అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. “ప్రపంచవ్యాప్తంగా ఉన్న అక్రమ సంపాదన అంతా కలిపితే, భూమి మీద ఉన్న సుమారు 800 కోట్ల మందికి ఒక్కో లాప్టాప్ చొప్పున కొనడానికి సరిపోతుంది. ఇంకా కొంత డబ్బు మిగులుతుంది కూడా. అయితే ఆ నల్లధనంలో ప్రతి వంద భాగాలకు కేవలం ఒక్క భాగం మాత్రమే వెనక్కి రికవరీ అవుతోంది” అన్నారు.
కేంబ్రిడ్జ్ వర్సిటీ సదస్సులో సీజేఐ వ్యాఖ్యలు
భూమిపై ఉన్న ప్రతీ ఒక్కరికీ ఓ మంచి లాప్టాప్ కొనేంత నల్లధనం కేవలం ఒక్క ఏడాదిలోనే అక్రమంగా పోగవుతోందనీ, అంత పెద్ద మొత్తంలో నల్లధనం చలామణి అవుతున్నా, అందులో కనీసం ఒక శాతం కూడా వెనక్కి రాకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ అరెస్ట్ మోసాల లాంటి కొత్త రకం నేరాలను అరికట్టడంలో మన దేశ న్యాయవ్యవస్థే ముందుండి పనిచేస్తుందని ఆయన చెప్పారు.
“మన దేశంలో పీఎంఎల్ఏ 2002, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుల చట్టం 2018 వంటి చట్టాలు అమల్లో ఉన్నాయి. అయితే, ఈ చట్టాలన్నీ పూర్తిగా తప్పులు లేనివని నేను అనట్లేదు” అని సీజేఐ వివరించారు. ఆర్థిక మోసాలను అడ్డుకోవడానికి దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నల్లధనంలో ప్రతి వంద భాగాలకు కేవలం ఒక్క భాగం మాత్రమే వెనక్కి వస్తోందని గుర్తుచేశారు.
పీఎంఎల్ఏ (PMLA) చట్టాన్ని దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయని సీజేఐ తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితులకు అండగా నిలవడానికి, వ్యవస్థలో ఉన్న తప్పులను సరిదిద్దడానికే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటోందని ఆయన తెలిపారు.