AP MPTC ZPTC Elections Counting: పరిషత్‌ ఎన్నిల కౌంటింగ్‌లో పదనిసలు.. ఆసక్తికర విషయాలు

|

Sep 19, 2021 | 10:27 AM

AP MPTC ZPTC Elections Counting: ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 206 కేంద్రాల్లో కౌంటింగ్‌ జరుగుతోంది. విశాఖపట్నం..

AP MPTC ZPTC Elections Counting: పరిషత్‌ ఎన్నిల కౌంటింగ్‌లో పదనిసలు.. ఆసక్తికర విషయాలు
Follow us on

AP MPTC ZPTC Elections Counting: ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 206 కేంద్రాల్లో కౌంటింగ్‌ జరుగుతోంది. కౌంటింగ్ సందర్భంగా పలు చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆరుమాసాల తర్వాత తెరిచిన బ్యాలెట్ బ్యాక్స్ ల్లో కొన్ని చోట్ల నీళ్లు కనిపించగా, మరికొన్ని చోట్ల  చదలు దర్శనమిచ్చాయి.  విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం బ్యాలెట్ బాక్స్‌లో నీళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించి షాక్ కు గురయ్యారు. మొత్తం ఏడు బ్యాక్స్ ల్లో నీళ్లు ఉండటం గుర్తించారు. పాకలపాడు, మాకవరపాలెం మండలం, తూటిపాల, పాపయ్యపాలెం బ్యాలెట్ బాక్సుల్లోకి నీరు వెళ్లడంతో బ్యాలెట్ పేపర్లు తడిచిపోయాయి. బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు ఉన్నాయని కలెక్టర్‌కు సమాచారం అందించారు. తడిసిన బ్యాలెట్ పత్రాలను ఆరబెట్టి లెక్కించేందుకు అభ్యర్థులు అంగీకరించారు. ఆ మేరకు కలెక్టర్ ఆదేశాలతో బ్యాలెట్లను ఆరబెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఓ బ్యాలెట్ బాక్స్ లో తడిచిపోయిన బ్యాలెట్ పేపర్ లు.

గుంటూరు జిల్లా తాడికొండ మండలం బేజాత్‌పురం, రావెల, ఎంపీటీసి స్థానాల్లో ఓట్ల లెక్కింపుపై సందిగ్దత కొనసాగుతోంది. ఓ బ్యాలెట్ బాక్స్‌లోబ్యాలెట్ పేపర్‌లు తడిచిపోయాయి. దీంతో కౌంటింగ్‌ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక ప్రకాశం జిల్లా కనిగిరి కౌంటింగ్‌ కేంద్రంలో ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. పామూరు మండలం 5వ ఎంపిటిసి ఎలక్షన్ కౌంటింగ్‌పై వైసీపీ, సీపీఎం ఏజెంట్ల మధ్య వాగ్వాదం నడిచింది. బ్యాలెట్ బాక్స్ టేబుల్‌పైన పెట్టి తర్వాత కింద పెట్టడంపై సీపీఎం ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. బ్యాలెట్‌ బాక్స్‌ను తిరిగి టేబుల్‌పై పెట్టాలని సీపీఎం ఏజెంట్ల పట్టుబట్టారు.

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ  రూరల్ మండలం కరప పోలింగ్ బాక్సు తాళం తుప్పుపట్టి పని చేయలేదు. దీంతో అధికారుల సమక్షంలో తాళాలను పగులగొట్టారు. బ్యాలెట్ బాక్సులోపల పత్రాలు సేఫ్ గా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బ్యాలెట్ పత్రాలకు నీటి మరకలు ఉండటంతో జాగ్రత్తగా కౌంటింగ్ ప్రారంభించారు.

అలాగే నెల్లూరు జిల్లా కావలి విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారుల నిర్లక్ష్యం కనిపించింది. అల్లూరు మండలం స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనిపించకపోవడంతో సిబ్బంది తాళాలను పగులగొట్టారు.

కృష్ణా జిల్లాలోని ఇబ్రాహీంపట్నంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్లో ఆరు ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఆ ఆరు ఓట్లు కూడా చెల్లనివిగా పోస్టల్ కౌంటింగ్ అధికారి గుర్తించారు.

ఎంపీటీసీ: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. నోటిఫికేషన్ జారీ సమయంలో.. 375 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మొత్తం 9672 స్ధానాల్లో.. 2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. సుదీర్ఘ ప్రక్రియలో అభ్యర్ధుల మృతితో 81 స్థానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. 7220 స్ధానాలకు ఎన్నికలు జరగగా.. 18,782 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.

జడ్పీటీసీ: ఏపీలో మొత్తం జడ్‌పీటీసీ స్థానాలు 660 ఉండగా.. 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 652 స్ధానాల్లో.. 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 515 స్ధానాలకు పోలింగ్ జరగగా.. 2058 అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.