పై ఫోటోలో ముగ్గురు మహిళా ఎంపీలు ఉన్నారు. వారు ఒక్కసారిగా గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. తిరగలి తిప్పుతూ.. రోకలిలో సామలు దంచుతూ.. కాసేపు సమయం గడిపారు. ఇంతకీ ఎవరా ఎంపీలు..? ఎందుకలా చేశారు..?. ఛలో తెలసుకుందాం పదండి.
ఫోటోలో ఉన్నది.. అరకు ఎంపీ మాధవి. కాకినాడ ఎంపీ వంగా గీత. మరొకరు కేరళ రాష్ట్రానికి చెందిన అల్తూరు ఎంపీ రమ్య హరిదాస్. అరకు పర్యటనకు వచ్చిన వంగా గీత, రమ్య హరిదాస్ కు సాదరంగా ఆహ్వానం పలికిన ఎంపీ గొడ్డేటి మాధవి.. అరకు రూరల్ మండలంలో పెదలబుడులో నిర్మించిన గిరిజన సాంప్రదాయం ప్రతిబింబించే గిరి గ్రామదర్శిని సందర్శనకు వారిని తీసుకువెళ్లారు. అయితే.. సహచర ఎంపీలను తమ సాంప్రదాయాన్ని తెలిపేలా అరకు ఎంపీ మాధవి స్వయంగా గిరిజన సాంప్రదాయ దుస్తులను ధరించారు. దీంతో సహచర ఎంపీలు వంగా గీత, రమ్య హరిదాస్ కూడా గిరిజన సాంప్రదాయ వేషధారణకు మంత్ర ముగ్దులయ్యారు. వాళ్ళు కూడా అలాంటి వస్త్రాలు ధరించి గిరిజన మహిళల్లా ముస్తాబయ్యారు. గిరి గ్రామదర్శిని గురించి.. అక్కడ సాంప్రదాయాల గురించి ఎంపీ మాధవి స్వయంగా వారికి వివరించారు. అక్కడే రోకలి దంచుతూ.. తిరగలి తిప్పారు. వనదేవతకు పూజలు చేశారు. ఇక.. అంత చేసి ధింసా చేయకుండా ఉంటే ఎలా..? అందుకే స్థానిక గిరిజన మహిళలతో కలిసి ముగ్గురు మహిళా ఎంపీలు ధింసా నృత్యం చేశారు. కనుమరుగవుతున్న గిరిజన సాంప్రదాయం కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించే గిరి గ్రామదర్శిని తిలకించి… గిరి సాంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ ఎంపీలు గుర్తు చేశారు.
కాగా గిరి గ్రామదర్శినిని సందర్శించడం కొత్త అనుభూతిని కలిగించిందన్నారు ఎంపీలు వంగా గీత, రమ్య హరిదాస్. గిరిజన ఆచార వ్యవహారాలు, వారి జీవనస్థితిగతులు, ఇతరత్రా వివరాలు తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులు, సందర్శకులకు గిరి గ్రామదర్శిని మంచి వేదిక అని కితాబునిచ్చారు.
– ఖాజా, వైజాగ్, టీవీ9 తెలుగు
Also Read: సంక్షేమమే అజెండా.. అక్టోబర్లో వారందరికీ సీఎం జగన్ వరాలు