Andhra: ఇంటర్వెల్, లంచ్ మాత్రమే కాదు.. ఏపీ పాఠశాలల్లో మరో బ్రేక్ కూడా..
తెలుగు రాష్ట్రాలలో ఎండ దంచికొడుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో సమ్మర్పై ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. భానుడి భగభగలు పెరిగిపోవడంతో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై రోజూ మొబైల్ అలర్ట్స్ ద్వారా ప్రజలకు చేరవేయాలని సూచించారు.

ఏపీలోని పాఠశాలల్లో ఇంటర్వెల్, లంచ్ బ్రేక్ మాత్రమే కాదు.. అదనంగా మరో బ్రేక్ రానుంది. అదే వాటర్ బెల్. వేసవిలో విద్యార్థులు డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్నింగ్ 8.45 గంటలకు ఒకసారి.. 10.50 గంటలకి రెండోసారి.. 11.50 గంటలకు మూడోసారి బెల్ మోగించి.. ఐదు నిమిషాల చొప్పున స్టూడెంట్స్ మంచి నీళ్లు తాగేందుకు బ్రేక్ ఇవ్వనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వేసవి ప్రణాళికపై విపత్తుల నిర్వహణ, వైద్యారోగ్య శాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు… ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేసి… వారు ఎండలబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించాలని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వేసవిని ఉంచుకుని తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో చాలా ప్రాంతాల్లో పశువులకు తాగునీరూ లభించని పరిస్థితి ఉంటుందని, ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అడవుల్లో అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని.. డ్రోన్లతో పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..