Vizag Steel Plant: విశాఖ ఉక్కుగర్జనసభలో పార్టీనేతల రాజకీయగర్జన.. ఆరు తీర్మానాలు..

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అధికార, విపక్షపార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. కేంద్రం తీరుపై మండిపడ్డాయి. పార్లమెంట్‌లో ఎలాంటి పోరాటానికైనా, రాజీనామాలకైనా సిద్ధమని ప్రకటించాయి.

Vizag Steel Plant: విశాఖ ఉక్కుగర్జనసభలో పార్టీనేతల రాజకీయగర్జన.. ఆరు తీర్మానాలు..
Vizag Steel Plant

Updated on: Jan 31, 2023 | 9:13 AM

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అధికార, విపక్షపార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. కేంద్రం తీరుపై మండిపడ్డాయి. పార్లమెంట్‌లో ఎలాంటి పోరాటానికైనా, రాజీనామాలకైనా సిద్ధమని ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.

ఉక్కు ప్రజాగర్జన సభలో పాల్గొన్న పార్టీల నేతలు..

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రెండేళ్లుగా ఉద్యమం చేస్తున్న కార్మిక సంఘాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. ఉక్కు ప్రజాగర్జన పేరుతో విశాఖలో భారీ బహిరంగసభను నిర్వహించాయి. ఈ సభకు అన్ని పార్టీల ముఖ్యనేతలను ఆహ్వానించాయి కార్మికసంఘాలు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని తలపెట్టిన ఈ కార్యక్రమానికి భారీగా కార్మికులు, ప్రజలు హాజరయ్యారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడంతో పాటు నిర్వాసితుల, కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ అరు తీర్మానాలు చేసింది ఉక్కు ప్రజాగర్జన సభ. తీర్మానాల ప్రతులపై అన్నీ రాజకీయపార్టీల నేతలు సంతకాలు చేశారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉంటుందన్నారు ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని, భవిష్యత్తులో జరిగే అన్ని ఉద్యమాలను ప్రభుత్వమే ముందుండి నడిపిస్తుందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు వైసీపీ నేత, టీడీపీ ఛైర్మన్‌ వైవి. సుబ్బారెడ్డి.

ఇవి కూడా చదవండి

స్ట్రీల్‌ప్లాంట్‌ పరిశ్రమ కోసం తమ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. టీడీపీతోపాటు మిగతా పార్టీల ఎంపీలంతా కలిసి పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని పిలుపునిచ్చారు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశం కార్మికులు, నిర్వాసితుల సమస్యే కాదని, అది రాష్ట్ర సమస్య అని చెప్పారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. అందరం కలిసి పోరాడితేనే కేంద్రం దిగివస్తుందన్నారాయన.

మొత్తానికి మంగళవారం నుంచి జరగబోయే పార్లమెంట్‌ సెషన్‌లో స్టీల్‌ప్లాంట్‌పై కలిసికట్టుగా పోరాటం చేయాలని అన్నీ పార్టీలు పిలుపునిచ్చాయి. ఇక ఉక్కు ప్రజాగర్జన సభ విజయవంతం కావడంతో కార్మికసంఘాలు రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us