
కొత్త ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే కొత్త ఇళ్లను మంజూరు చేసేందుకు సిద్దమవుతోంది. పీఎ ఆవాస్ యోజన పథకం కింద ఉగాది నాటికి ఇళ్లను కేటాయించేందుకు సన్నాహాలు చేస్తోంది. పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా కేంద్రం తన వాటా ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా కేటాయించి పేదలకు ఇళ్లను నిర్మించే పథకాన్ని అమలు చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ వరకు ఏపీ ప్రభుత్వ ఈ పథకం క్రింద దరఖాస్తులను స్వీకరించింది. దీంతో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారుల జాబితాను సిద్దం చేసి కేంద్రానికి పంపించింది. ఇక కేంద్రం కూడా లబ్దిదారుల జాబితాను పున:పరిశీలిస్తోంది. కేంద్రం నుంచి త్వరలోనే జాబితాకు ఆమోదం లభించనుండగా.. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఇళ్లను నిర్మించుకునేందుకు లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించనుంది.
అయితే గతంలో నియోజకవర్గం ప్రతిపాదికన ఇళ్లను మంజూరు చేసేవారు. కానీ ఇప్పుడు అది అమల్లో లేదు. కేంద్ర ప్రభుత్వమే నేరుగా యాప్ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేస్తోంది. దీంతో నియోజకవర్గం ప్రాతిపదికన ఇళ్లను కేటాయించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. దీని వల్ల ఎక్కడ ఎన్ని ఇవ్వాలి..? ఎవరెవరికి కేటాయించాలి? అనేది తమకు తెలుస్తుందని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం గురించి ఎమ్మెల్యేలు ప్రస్తావించగా.. గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారధి సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వమే యాప్ ద్వారా లబ్దిదారులను గుర్తించి ఇళ్లను కేటాయిస్తుందని, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్ని ఇళ్లు అనే ప్రాతిపదిక ప్రస్తుతం లేదని తెలిపారు.
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో నియోజకవర్గం వారీగా ఇళ్ల కేటాయింపుపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్థసారధి సమాధానిస్తూ.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తామంటూ స్పష్టం చేశారు. అటు వాంబే కాలనీల అంశంపై కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. వాంబే కాలనీల మరమ్మత్తుల గురించి ఎమ్మెల్యేలు ప్రశ్నించగా.. వాటి మరమ్మత్తులకు ఎలాంటి విధానం ప్రస్తుతం లేదని పార్థసారధి సమాధానమిచ్చారు. బ్యాంకు లోన్, లబ్దిదారుడి వాటాతోనే ఆ ఇళ్లను నిర్మించారని, మరమ్మత్తులు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. కాగా గతంలో ప్రతీ నియోజకవర్గానికి ఇన్ని ఇళ్లు అంటూ కేటాయించేవారు. కానీ ఇప్పుడు ఆ విధానం అమల్లో లేదు. లబ్దిదారుల ఆర్ధిక పరిస్థితి, ఆదాయ వనరులు ఆధారంగా ఇళ్లను కేటాయిస్తున్నారు.