Andhra Pradesh: ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలెర్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలలో పింఛన్‌ను గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర పంపిణీ చేయగా.. మే నెలలో లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేశారు.. కొందరికి మాత్రం ఇంటికి తీసుకెళ్లి ఇచ్చారు. మరి జూన్ నెలలో...?

Andhra Pradesh: ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలెర్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Andhra Pensions

Updated on: May 29, 2024 | 2:26 PM

ఆంధ్రాలో పెన్షన్ లబ్దిదారులకు అలెర్ట్. జూన్ నెలకు పెన్షన్లపై క్లారిటీ వచ్చేసింది. జూన్‌ 1న పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని  ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, నడవలేనివారు, వీల్‌ఛైర్‌లోనే ఉండేవారికి మాత్రం ఇళ్ల వద్దకు వచ్చి పెన్షన్ ఇవ్వనున్నారు. అయితే గత నెలలో బ్యాంక్ అకౌంట్‌ల విషయంలో చాలామంది వృద్దులు ఇబ్బందిపడ్డారు. బ్యాంకుకు వెళ్లి డబ్బులు తెచ్చుకోడానికి ఎండలో కష్టాలు పడ్డారు. ఈ నెల కూడా బ్యాంకులకు వెళ్లాలంటే వారికి ఇబ్బందే.

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన సందర్భంలో..  ఏప్రిల్ నెల నుంచి వాలంటీర్లను ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టింది. వారితో పెన్షన్ల పంపిణీ నిలిపివేయాలని ఆదేశించింది.. దీంతో ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేశారు. మే నెలలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ నెల కూడా అదే పద్దతిని పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేయాలని సూచిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీపై ఎలక్షన్ కమిషన్ కూడా గతంలో మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర పింఛన్లు పంపిణీ చేయాలని సూచించింది. దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడేవారు, నడవలేనివారికి ఇంటి దగ్గరే పంపిణీ చేయాలని ఆదేశించింది. ఆ నెల గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర పింఛన్లను పంపిణీ చేశారు. మే నెలలో ప్రభుత్వం బ్యాంకు అకౌంట్‌లలో పింఛన్ డబ్బుల్ని జమ చేసింది. దీంతో పింఛన్ లబ్ధిదారులు బ్యాంకులకు క్యూ కట్టడంతో అక్కడ రద్దీ పెరిగింది.. కొందరికి బ్యాంక్ అకౌంట్‌ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

మరోవైపు ఏపీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. జులై నెల నుంచి అధికారం చేపట్టబోయే ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేయనుంది. వైసీపీ తాము అధికారంలోకి రావడం తథ్యమని.. మళ్లీ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి అవ్వాతాతలకు పింఛన్లు ఇస్తారని చెబుతోంది. అటు టీడీపీ కూటమి కూడా గెలుపుపై ధీమాగా ఉంది. తాము ఇచ్చిన హామీ ప్రకారం.. జులై నెల నుంచి పింఛన్‌ను రూ.3 వేల నుంచి 4వేలకు పెంచి పంపిణీ చేస్తామంటోంది. దివ్యాంగులకు అయితే రూ.6వేలు పింఛన్ ఇస్తామని చెబుతోంది. అంతేకాదు పెంచిన పింఛన్ ఏప్రిల్ నెల నుంచి ఇస్తామని.. జులై నెలకు సంబంధించి రూ.4వేలు.. మూడు నెలలకు సంబంధించి పెంచిన పింఛన్ నెలకు వెయ్యి చొప్పున 3 వేలు కలిపి రూ.7 వేలు ఇస్తామని చెబుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..