
జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 31: పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడు వరసకు బాబాయి అయ్యే వ్యక్తిపై దాడి చేశాడు. కోడి కత్తితో బాబాయిపై దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచి హతమార్చాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్లోని జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం (అక్టోబర్ 30) చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
జంగారెడ్డిగూడెం పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ చెరువు రోడ్డులో ఇళ్ల శ్రీనివాసు (23) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతనికి వరసకు బాబాయి అయిన గోసుల ఏడుకొండలు అలియాస్ బాలాజీ (27) మధ్య గత కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. పాత గొడవల నేపథ్యంలో వారి మధ్య గొడవలను సర్దుబాటు చేసుకునేందుకు కొందరు సమీప బంధువులు యత్నించారు. ఈక్రమంలో వారిద్దరికీ సర్దిచెప్పేందుకు ఏడుకొండలు, శ్రీనివాసు స్నేహితులతో కలిసి గాంధీబొమ్మ సెంటర్కు వచ్చారు. అక్కడకు చేరుకున్న ఏడుకొండలు, శ్రీనివాసులకు మధ్యవర్తులు సర్దిచెబుతున్న క్రమంలో వీరిద్దరి మధ్య మరోమారు ఘర్షణ చెలరేగింది.
ఈ క్రమంలో సహనం కోల్పోయిన శ్రీనివాసు రహస్యంగా తన వెంట తెచ్చుకున్న కోడికత్తితో బాబాయి ఏడుకొండలుపై దాడి చేశాడు. దాడిలో శ్రీనివాసులు విచక్షణ రహితంగా కోడికత్తితో ఏడుకొండలను పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో కత్తిపోట్ల ధాటికి తీవ్రగాయాలపాలైన ఏడుకొండలుకు రక్తస్రావమైంది. వెంటనే అక్కడున్న స్నేహితులు బాధితుడిని స్థానిక ప్రాంతీయాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిచారు. అయితే అక్కడ పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ఏడుకొండలు మృతిచెందాడు.
దీనిపై సమాచారం అందుకున్న ఎస్సై మల్లికార్జునరెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు శ్రీనివాసు కోసం గాలించారు. అనంతరం అతన్ని అదుపులోకి స్టేషన్కు తరలించారు. కాగా మృతుడు ఏడుకొండలు స్థానికంగా పెయింటర్గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఓ పోలీసధికారి తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.