Fish Rates: కోవిడ్ ఎఫెక్ట్‌తో కుదేలైన ఆక్వా రంగం.. భారీగా తగ్గిన చేపల ధరలు.. ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి..

|

Aug 21, 2021 | 8:48 AM

Fish Rates: కోవిడ్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం కుదేలైంది. ఎక్కడ చూసినా పెంచిన పంటకు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.

Fish Rates: కోవిడ్ ఎఫెక్ట్‌తో కుదేలైన ఆక్వా రంగం.. భారీగా తగ్గిన చేపల ధరలు.. ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి..
Fish Rates
Follow us on

Fish Rates: కోవిడ్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం కుదేలైంది. ఎక్కడ చూసినా పెంచిన పంటకు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల ఆక్వా రంగాన్ని వదిలేసిన పరిస్థితి ఏర్పడింది. ఆరుగాలం శ్రమించి పెంచిన చేపలకు ఇప్పుడు అమాంతం ధరలు పడిపోవడంతో రైతులు ఏం చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు. అప్పు చేసి మరి ఆక్వా సాగుపై పెట్టిన పెట్టుబడి రాక దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు.

కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేల ఎకరాల్లో ఆక్వా రంగం సాగులో ఉంది. ఒకప్పుడు లాభాల బాటలో సిరులు పండించిన ఆక్వా పంట నేడు నష్టాల కడలిలో కుంగిపోయింది. దీనికి ప్రధాన కారణం కరోనా. ఈ మహమ్మారి మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చింది. ప్రతి రంగాన్ని అతలాకుతలం చేసింది. అయితే ఇప్పుడే మానవాళి కరోనా నుంచి మెల్లగా కోరుకుంటున్నా అనేక రంగాలపై దాని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. మార్కెట్లో చేపల ధరలు అమాంతంగా పడిపోయాయి. కేజీ 120 నుంచి 150 వరకు పలికిన ధరలు ప్రస్తుతం 80 నుండి 90 రూపాయలకు పడిపోవడంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి రాక అప్పులపాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఆక్వా పంటనే ఖర్చుతో కూడుకున్న పని.. ఎకరం ఈ ధర సుమారు లక్ష నుంచి లక్షా 50 వేల రూపాయల వరకూ ఉంది. అంతేకాక పిల్ల వేసినప్పటి నుంచి దాని మేత, మందుల ఖర్చు విపరీతంగా ఉంటుంది. ఏమాత్రం తేడా జరిగినా మధ్యలోనే అవి చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయినా సరే ఎన్నో కష్టనష్టాలకోర్చి రైతులు ఎక్కువ సాగు చేపడుతున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలు పడిపోవడంతో అపార నష్టం వాటిల్లుతుందని విలపిస్తున్నారు. ఒకప్పుడు శీలావతి, కట్లా లాంటి చేపలు బాగా డిమాండ్ ఉండేదని ప్రస్తుతం కరోనా కారణంగా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి డిమాండ్ తగ్గడం.. రాష్ట్రంలో కొనేవారు లేకపోవడంతో ధరలు భారీగా పతనమయ్యాయని రైతులు చెబుతున్నారు.

అయితే ఆక్వా సాగు పెరగడం, ప్రతి ఒక్కరూ అధిక లాభాలు వస్తాయనే ఉద్దేశంతో వేరే వేరే వ్యాపారాలపై ఆసక్తి చూపకుండా ఆక్వా రంగంపై మొగ్గు చూపటంతో చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సాగు ఎక్కువవడం, పక్క రాష్ట్రాల్లో సైతం కరోనా కారణంగా భారీగా ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో స్థానికంగా మార్కెట్‌లో చేపల ధరలు విపరీతంగా పడిపోయాయి. అంతేకాక పక్క రాష్ట్రాల్లో కూడా ఆక్వా సాగు మొదలవడం, బంగ్లాదేశ్‌లో కూడా ఆక్వా సాగవడంతో స్థానిక మార్కెట్లో ధరలు పడిపోయాయి. వేసిన పంటకు కేజీకి అయ్యే ఖర్చుతో పోలిస్తే పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయిందని, ఎకరాకు లక్ష రూపాయలు సొంత డబ్బులు నష్టం వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రభుత్వం తమ సమస్యలపై త్వరగా స్పందించి తమను ఆదుకొని, ఆక్వా రంగానికి నిలబెట్టాలని రైతులు కోరుతున్నారు.

Also read:

Daughter In Law: కూతురు, కోడలు..ఎవరు ఎక్కువ అంటే.. కోడలే ఎక్కువ అంటుంది సనాతన ధర్మం.. ఎందుకంటే

Naxals Attack: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. భద్రతా దళాలపై దాడి.. అసిస్టెంట్‌ కమాండెంట్‌‌తో సహా ఇద్దరు మృతి

Karthika Deepam: మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను..సౌందర్యకు షాకిచ్చిన ఏసీపీ రోషిణి!