జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్..ఈ మధ్యకాలంలో వార్తల్లో హాట్ టాపిక్గా మారారు. ఆయన వ్యవహార శైలి పార్టీ వర్గాలకు గుస్సా తెప్పిస్తోంది. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్ధిస్తోన్న ఆయన..ఇంగ్లీషు మీడియం వంటి అంశాల విషయంలో సొంత పార్టీ స్టాండ్ను సైతం వ్యతిరేకిస్తున్నారు.
తాజాగా డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా..ఆయన ఫోటోకు రాపాక పాలాభిసేకం చేశారు. ఈస్ట్ గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం మోరీ గ్రామంలో… చేేనేత వేడుకల్లో పాల్గొన్న రాపాక, జగన్ ఫోటోను పాలతో అభిషేకించారు. అయితే రాజోలు ఎమ్మెల్యే ఈ తరహా ప్రవర్తన చెయ్యడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు చేయూత కోసం ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన ‘వైఎస్ఆర్ వాహనమిత్ర’ పథకాన్ని ప్రశంసిస్తూ జగన్ ఫ్లెక్స్కు పాలాభిసేకం చేశారు. కాగా కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు రాపాక. ఆయనపై జనసేనాని వేటు వేసినట్టుగా ఇటీవల రూమర్స్ హల్చల్ చేశాయి. పార్టీకి నేతల వరస రాజీనామాల నేపథ్యంలో.. ఉన్న ఏకైక ఎమ్మెల్యేను వదులుకోవడం ఇష్టం లేక సేనాని పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తున్నట్టు తెలుస్తోంది.