ఏపీలో సచివాలయంలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా 4వ బ్లాక్లోని వ్యవసాయ శాఖలోని ఓ ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో సచివాలయంలోని 4వ బ్లాక్లో విధులు నిర్వహించే వ్యవసాయ ఉద్యోగులందరికీ హోమ్ క్వారంటైన్ సూచించారు. ఈ మేరకు వ్యవసాయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 1 తేదీ నుంచి 14 తేదీ వరకు వీరందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిందిగా స్పష్టం చేస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా రెండు రోజుల క్రితం ఏపీ సచివాలయంలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో అమరావతికి చేరుకున్న సచివాలయ ఉద్యోగుల్లో ఒకరికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో 3, 4 బ్లాకుల్లోకి ఎంట్రీని నిషేధించారు. ఆ రెండు బ్లాకులను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. కాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా 3,118కి చేరింది. వీరిలో 64 మంది చనిపోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 885 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read This Story Also: పవన్ ఈసారి కూడా పంపలేదు.. మిస్ అవుతున్నా..!