
అభంశుభం తెలియని ఓ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే స్టేషన్ సమీపంలో పార్క్ చేసి ఉన్న ఆటోలో వదలి వెళ్లిన ఘటన విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జ్ఞానాపురం పార్సిల్ కౌంటర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. శిశువును సంరక్షించి దర్యాప్తు ప్రారంభీంచారు రైల్వే పోలీసులు. స్థానిక పోలీసుల సహాకారంతో తల్లిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. రైల్వే స్టేషన్ జ్ఞానాపురం వైపు గేట్ నెంబర్ 5 ఎదుట ఈ ఉదయం ఒక ఆటో పార్క్ చేసి ఉంది. ఆటో డ్రైవర్ అక్కడికి వచ్చేసరికి శిశువు ఏడుపు వినిపించింది. ఏంటా అని లోపలకు తొంగి చూడగా.. వస్త్రంలో చుట్టిన శిశువు కనిపించింది. దీంతో వెంటనే ఆటో డ్రైవర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆటోలోని శిశువును మగ శిశువుగా గుర్తించి.. శిశువును స్వాదీనం చేసుకుని చైల్డ్ లైన్ కు అప్పగించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం శిశువును కేజీహెచ్ కు తరలించారు. తల్లి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.
అయితే శిశువును వదిలి వెల్లిన తల్లి ఆచూకీని గుర్తించేందుకు స్థానికంగా ఉన్న సిసి ఫుటేజీని పరిశీలించారు పోలీసులు. ఓ మహిళ చిన్నారిని తీసుకొని రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారంపై సంచరిస్తున్నట్టు గుర్తించారు. ఆమె శిశువును ఆటోలో విడిచిపెట్టి వెల్లినట్టు నిర్ధారించుకొని ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో విడిచిపెట్టిన బ్యాగు నుంచి బ్యాంకు పాస్బుక్, ఇతర పత్రాల ద్వారా తల్లి గుర్తింపు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆమె వేపాడకు చెందిన మహిళగా గుర్తించారు. తల్లిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి శిశువును అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.