
అనంతపురం పట్టణంలోని సాయినగర్లో భారతి హాస్పిటల్కు చెందిన జనరేటర్లో గుర్తు తెలియన వృద్ధుడి మృతదేహాన్ని హాస్పిటల్ సిబ్బంది గుర్తించారు. బాగా దుర్వాసన రావడంతో.. ఏదైనా ఎలుక చనిపోయిందేమో అనుకుని జనరేటర్ డోర్ ఓపెన్ చేసిన సిబ్బందికి.. ఓ డెడ్బాడీ కనిపించింది. దీంతో కంగుతిన్న హాస్పిటల్ సిబ్బంది.. యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆ దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. ఎప్పుడో పది రోజుల క్రితం మతిస్థిమితం లేని ఓ వృద్ధుడు జనరేటర్ డోర్ ఓపెన్ చేసి ఉందని.. లోపలికి వెళ్లినట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
ఈ నెల 8వ తేదీన సాయంత్రం ఏడు గంటల యాభై నిమిషాలకు మతిస్థిమితం లేని వృద్ధుడు భారతి హాస్పిటల్ ముందు ఉన్న జనరేటర్ దగ్గరకు వచ్చి అటు ఇటు చూడగా ఎవరూ లేకపోవడంతో జనరేటర్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో.. లోపలికి వెళ్ళాడు. అయితే ఇవాళ తీవ్రమైన దుర్వాసన రావడంతో.. జనరేటర్ డోర్ ఓపెన్ చేసి చూడగా వృద్ధుడి డెడ్ బాడీ కనిపించింది. పది రోజుల క్రితం జనరేటర్ లోపలికి వెళ్లిన ఆ మతిస్థిమితం లేని వృద్ధుడు.. ఎలా చనిపోయాడనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.
కరెంటు పోయినప్పుడు.. జనరేటర్ ఆన్ చేసినప్పుడు.. ఏమైనా ఆ వేడి తట్టుకోలేక.. పొగకు ఊపిరాడక చనిపోయాడా.? లేక అనారోగ్యంతో మృతి చెందాడా.? అన్న కోణంలో టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జనరేటర్ డోర్ లాక్ చేసుకోకుండా ఓపెన్ చేసి ఉండటం ఒక ఎత్తు అయితే.. పది రోజుల క్రితం లోపలికి వెళ్లి చనిపోయిన వ్యక్తిని తీవ్ర దుర్వాసన వచ్చేవరకు గుర్తించకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది.