Andhra: స్కూల్‌కు వెళ్లడమే ఆ పిల్లాడు చేసిన తప్పు.. సాయంత్రానికి విగతజీవిగా..

అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్కూలు స్విమ్మింగ్ పూల్ లో పడి ఒకటో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మునగపాక మండలం తిమ్మరాజుపేటలోని డా విన్సీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. యాజమాన్య తీరుకు నిరసనగా బాధ్యత కుటుంబం ఆందోళన చేపట్టింది.

Andhra: స్కూల్‌కు వెళ్లడమే ఆ పిల్లాడు చేసిన తప్పు.. సాయంత్రానికి విగతజీవిగా..
Vizag News

Edited By: Ravi Kiran

Updated on: Nov 14, 2025 | 10:53 AM

ఆరేళ్ల మోక్షిత్.. తల్లి, కుటుంబసభ్యులతో కలిసి ఎలమంచిలి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. రోజు మాదిరిగానే ఉదయం స్కూల్‌కి వెళ్ళాడు మోక్షిత్. సాయంత్రం 6 గంటలకు తిరిగి ఇంటికి చేరుకోవాల్సి ఉంది. సోదరుడు తిరిగి వచ్చినా మోక్షిత్ ఇంటికి చేరలేదు. స్కూలుకు వెళ్లిన కొడుకు ఇంటికి తిరిగి రాకపోయేసరికి ఆందోళన చెందిన కుటుంబం యాజమాన్యానికి ఫోన్ కాల్ చేసింది. వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో నేరుగా స్కూలుకు వెళ్లారు విద్యార్థి కుటుంబ సభ్యులు. స్కూల్లో వెతికారు. చివరకు స్విమ్మింగ్ పూల్ వరకు వచ్చి చూసేసరికి అక్కడ బాలుడు వస్త్రాలు కనిపించాయి. ఆ పక్కనే మృతదేహం పడి ఉంది. దీంతో గుండెలు పట్టుకున్న ఆ తల్లి తల్లడిల్లిపోయింది.

బాలుడు ప్రాణాలు కోల్పోయినా కనీస సమాచారం ఇవ్వనందుకు.. యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత కుటుంబం.. ఆందోళనకు దిగింది. బాలుడు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. తల్లిదండ్రులకు గానీ, పోలీసులకు గానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని బయటపడేసి వెళ్లిపోయారని తల్లి నాగ శ్రీలత ఆవేదనతో ఆరోపిస్తోంది. పాఠశాల యాజమాన్యం తీరుపై బాధిత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.